
న్యూఢిల్లీ: మేఘాలయలో అదృశ్యమైన హనీమూన్ జంట కథలో అసలు నిజాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని కిల్లర్ల సాయంతో అతని భార్య సోనమ్ హత్య చేయించిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
బలవంతపు పెళ్లి?
మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భర్త రాజా రఘువంశీ హతమైన తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని ఒక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. రాజ్తో ప్రేమలో పడిన సోనమ్ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు రాజాను వివాహం చేసుకోవలసి వచ్చిందని తెలుస్తోంది. సోనమ్కు గతంలో రాజ్ కుష్వాహా అనే మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని, అందుకే ఆమె తన భర్త రాజాను చంపడానికి కుట్ర పన్నిందని ఇండియా టుడే పేర్కొంది. మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో భర్తను హత్య చేయడానికి ఆమె మధ్యప్రదేశ్కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్లతో మాట్లాడుకున్నట్లు తెలిసింది.
కీలక సమాచారమిచ్చిన గైడ్
ఈ జంటకు మే 11న వివాహం జరిగింది. మే 21న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న ఆ జంట అదృశ్యమయ్యింది. తరువాత రాజా మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. కాగా ఈ జంట చివరిసారిగా మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి కనిపించారని స్థానిక టూరిస్ట్ గైడ్ పోలీసులకు తెలిపారు. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు మధ్యప్రదేశ్కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్లు. రాజా హత్యకు గురైన స్థలంలో సోనమ్ దుస్తులు కనిపించడంతో, హత్యా సమయంలో ఆమె అక్కడే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
‘మా అమ్మాయి అమాయకురాలు’
మరోవైపు సోనమ్ వ్యవహారశైలిపై వస్తున్న వార్తలను ఆమె తండ్రి దేవీ సింగ్త తప్పుపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమెకు ఎవరితోనూ సంబంధాలు లేవన్నారు. రాజ్ అనే వ్యక్తి ఆమెతో కలిసి పనిచేస్తాడని తెలిపారు. రాజాతో సోనమ్కు బలవంతంగా వివాహం చేశారనే వార్తలను ఆయన ఖండించారు. ఇది మేఘాలయ పోలీసుల కట్టుకథ అని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని ఆయన అన్నారు.
భర్త హత్యకు సోనమ్ కుట్ర
మేఘాలయ పోలీసులు ఒక అధికారిక ప్రకటనలో ‘సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలోని నందగంజ్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల సురక్షిత కస్టడీలో ఉన్నారు. ఆమెను అక్కడికి తరలించేందుకు చట్టపరమైన ప్రోటోకాల్ను అనుసరిస్తున్నాం’ అని తెలిపారు. కాగా సోనమ్ తన భర్త హత్యకు కుట్ర పన్నారని, ఈ ప్రణాళికను అమలు చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్లతో మాట్లాడుకున్నారని మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇదాషిషా నోంగ్రాంగ్ ధృవీకరించారు. మధ్యప్రదేశ్కు చెందిన అనుమానితులలో ముగ్గురిని ఇప్పటివరకు అరెస్టు చేయగా, నాల్గవ వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు.
పోలీసులను ప్రశంసించిన సీఎం
స్థానిక టూరిస్ట్ గైడ్ గతంలో పోలీసులతో మాట్లాడుతూ ఆ జంట అదృశ్యమైన రోజున తాను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో వారిని చూశానని చెప్పారు. ఈ అంశమే దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసును త్వరగా చేధించినందుకు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సోషల్ మీడియాలో పోలీసులను ప్రశంసించారు. ‘ఏడు రోజుల్లో రాజా హత్య కేసులో మేఘాలయ పోలీసులు పురోగతి సాధించారు. మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు దుండగులను అరెస్టు చేశారు. నిందితురాలు పోలీసులకు లొంగిపోయింది. మరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు’ అని సంగ్మా ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: గ్రెటా థన్బర్గ్కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత