
కొనసాగుతున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు
అక్రమ వలసదారుల అరెస్టుల పట్ల ఆగ్రహం
నేడు భారీ ర్యాలీలకు సిద్ధమవుతున్న నిరసనకారులు
ఇమిగ్రేషన్ దాడులు, డిపోర్టేషన్లు కొనసాగుతాయన్న ట్రంప్ ప్రభుత్వం
వాషింగ్టన్/అస్టిన్: అమెరికాలో వలసదారుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. మరోవైపు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఆధ్వర్యంలో అక్రమ వలసదారుల అరెస్టులు, గెంటివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీలో శనివారం భారీ ఎత్తున మిలటరీ పరేడ్ జరుగనుంది. విదేశాల నుంచి అతిథులు హాజరు కాబోతున్నారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్’కార్యక్రమాలు నిర్వహించాలని, నిరసనలు ఉధృతం చేయాలని వలసదారులు నిర్ణయించారు. దాదాపు 2 వేల ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టేలా వ్యూహం రూపొందించారు. ఫిలడెల్ఫియాలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల శాంతియుతంగానే జరుగుతున్నప్పటికీ, మరికొన్నిచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి.
లాస్ ఏంజెలెస్, స్పాకేన్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని, ఇమ్మిగ్రేషన్ రైడ్స్, డిపోర్టేషన్లు యథాతథంగా కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే బలవంతంగా పంపించక తప్పదని స్పష్టంచేసింది.
అధికారులపై రాళ్లు, టపాకాయలతో దాడులు
అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాస్ వెగాస్లో 94 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు అభియోగాలు మోపారు. బుధవారం రాత్రి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 800 మంది వలసదారులు అధికారులపై విరుచుకుపడ్డారు. రాళ్లు, మంచినీటి సీసాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో నలుగురు అధికారులు గాయపడ్డారు.
జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. మిషగాన్లో గురువారం ఆందోళనలు జరిగాయి. వందలాది మంది పార్క్ ప్లాజాలో గుమికూడారు. ట్రంప్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. తమను బలవంతంగా బయటకు వెళ్లగొట్టాలని చూస్తే చట్టపరంగా పోరాడుతామని హెచ్చరించారు. సియాటెల్ డౌన్టౌన్లో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు పెప్పర్స్ప్రే చల్లారు. టపాకాయలు, రాళ్లు విసిరారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ను రద్దు చేయాలని నినదించారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పాకేన్ సిటీలో 30 మందికిపైగా నిరసనకారులు అరెస్టయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో, అరిజోనా రాష్ట్రంలోని టక్సన్లో ఆందోళనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అలాస్కాలో 40 మంది వలసదారులను పోలీసులు నిర్బంధించారు.
లాస్ ఏంజెలెస్లో గత వారం రోజుల్లో 470 మంది అరెస్టయ్యారు. న్యూజెర్సీలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ను నిరసనకారులు చుట్టుముట్టారు. ఈ కేంద్రంలో చాలామంది అక్రమ వలసదారులను అధికారులు నిర్బంధించారు. వీరిని వినిపించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో న్యూజెర్సీలో వెయ్యి పడకలతో డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు.
శనివారం ఆందోళనలు మరింత ఉధృతరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు రావడంతో పలు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా నేషనల్ గార్డు దళాలను మోహరిస్తున్నారు. ‘నో కింగ్స్’ర్యాలీలకు అనుమతి లేదని గవర్నర్లు చెబుతున్నారు. హింస, విధ్వంసానికి పాల్పడేవారిపై త్వరగా విచారణ చేపట్టాలని అమెరికా న్యాయ శాఖ అన్ని రాష్ట్రాల అటారీ్నలకు గురువారం సందేశం పంపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.
ట్రంప్ నిర్ణయానికి కోర్టు మద్దతు
ఆందోళనలు అణచివేయడానికి లాస్ఏంజెలెస్కు 4 వేల నేషనల్ గార్డు దళాలను, 700 మంది మెరైన్ గార్డులను రంగంలోకి దించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాలిఫోరి్నయాకు నేషనల్ గార్డు సిబ్బందిని పంపించాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోయింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.