ఇస్లామాబాద్: ఏళ్ల తరబడి పాకిస్తాన్లో బందీగా ఉన్న ఓ ఫ్రెంచ్ మహిళ, ఆమె ఐదుగురు పిల్లలకు విముక్తి లభించింది. పిల్లల్లో ఒకరైన టీనేజ్ కుమారుడు ఇంటి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జూన్ 18న వారిని దాచిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అత్యంత శిథిలావస్థలో ఉన్న గది నుంచి 54 ఏళ్ల సిల్వీ యాస్మినా, ఆమె పిల్లలను రక్షించారు. వారిని పెషావర్లోని ఆశ్రయానికి తీసుకువెళ్లారు.
ఆ కుటుంబం ఫ్రాన్స్కు తిరిగి వెళ్లాలని న్నట్లు పోలీసులు తర్వాత ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. వారి శరీరాలపై గాయాలు, దెబ్బల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉన్న బారా పర్వత ప్రాంతంలో ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఆ్రస్టేలియాలో అక్రమంగా నివస్తున్నాడు. ఆ సమయంలో సిల్వీతో పరిచయం ఏర్పడింది. 2003లో వారిద్దరి వివాహం జరిగింది. 2014లో ఆ్రస్టేలియా నుంచి పాకిస్తాన్కు వచ్చారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు.
పాకిస్తాన్కు వచ్చిన తరువాత మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే పాకిస్తాన్కు వచ్చినప్పటినుంచే పరిస్థితులు మారిపోయాయయి. మహిళను ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. ఆ ఇద్దరు పెద్ద పిల్లలు చదువు మాన్పించేశారు. అంతేకాదు.. పాకిస్తాన్లో పుట్టిన ముగ్గురు పిల్లలయితే పాఠశాల ముఖమే చూడలేదు. భర్త తనను, పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సిల్వీ తెలిపారు. ‘‘12 ఏళ్లపాటు మా స్వేచ్ఛను హరించాడు. మమ్మల్ని రోజూ కొట్టేవాడు. నన్ను, నా పిల్లలను ఇతర వ్యక్తులతో కలవకుండా అడ్డుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. నా భవిష్యత్తు అప్పటికే నాశనమైపోయింది. నా పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందని భయపడ్డాను.’’అని ఆమె పోలీసులకు చెప్పారు.


