కోపెన్హాగన్: డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ఫారో దీవుల తీరంలో హృదయం ద్రవించే ఘోరం జరిగింది. వెయ్యేళ్ల నాటి వికింగ్ సంప్రదాయం పేరిట వందలాది సముద్ర జీవులను వేటాడి, కిరాతకంగా నరికి చంపారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 700కి పైగా పైలట్ తిమింగలాలు, డాల్ఫిన్లు వేటగాళ్ల కత్తులకు బలికావడంతో, నీలిరంగు సముద్రం కాస్తా నెత్తుటి మడుగులా మారిపోయింది. జంతు హక్కుల సంఘాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, స్థానిక చట్టాలు, ప్రభుత్వం వీరికి అండగా నిలవడం సంచలనంగా మారింది.
నెత్తురోడిన తీరం..
ఈ సామూహిక వేటను స్థానికంగా ‘ది గ్రైండ్’ అని పిలుస్తారు. బోట్ల సహాయంతో తిమింగలాలు, డాల్ఫిన్లను బలవంతంగా లోతు తక్కువ ఉన్న ఒడ్డుకు తోలుకువచ్చారు. ఆపై కత్తులు, కొక్కేలతో వాటిని బీచ్లోనే నరికి చంపారు. ఒడ్డున చేరిన వందలాది మంది ప్రజలు, చిన్న పిల్లల ముందే ఈ జీవుల పొట్టలను కోసి ముక్కలు ముక్కలుగా నరికారు. గ్లోబల్ మెరైన్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ ‘సీ షెపర్డ్’ నివేదిక ప్రకారం.. టోర్షావ్న్లో 402 పైలట్ తిమింగలాలు, నాలుగు బాటిల్నోస్ డాల్ఫిన్లు, స్కాలబోట్నర్లో 168 వైట్-సైడెడ్ డాల్ఫిన్లు, హ్వాల్విక్లో 132 వైట్-సైడెడ్ డాల్ఫిన్లను చంపడంతో మొత్తం సంఖ్య 706కు చేరింది. ఈ ఘోరకలిపై జంతు సంక్షేమ సంస్థ ‘పెటా’ (PETA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ జీవులను చంపడం అత్యంత అనాగరికమని, తక్షణమే యూరప్ ప్రభుత్వాలు ఈ వేటను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
చట్టం రక్షణ.. సంప్రదాయం పేరిట సమర్థన
ఈ వెయ్యి ఏళ్ల నాటి పద్ధతి క్రూరమైనదని పర్యావరణవేత్తలు నెత్తీనోరూ బాదుకుంటుంటే, ఫారో దీవుల ప్రభుత్వం మాత్రం దీన్ని సమర్థిస్తోంది. తిమింగలాల వేట తమ సాంస్కృతిక గుర్తింపులో భాగమని, స్థానిక సమాజానికి ఇది ఉచిత ఆహారాన్ని అందిస్తుందని వాదిస్తోంది. అంతేకాదు ఉత్తర అట్లాంటిక్లో పైలట్ తిమింగలాల జనాభా ఆరోగ్యంగానే ఉందని, తాము జంతువులకు తక్కువ బాధ కలిగించే ఆధునిక పద్ధతులనే వాడుతున్నామని పేర్కొంది. విచారకరమైన విషయం ఏంటంటే, ఈ వేటగాళ్లపై ఎలాంటి జంతు హింస చట్టాల కింద కేసు నమోదు కాకుండా ఫారో పార్లమెంట్ ఏకగ్రీవంగా రక్షణ చట్టాన్ని కూడా ఆమోదించింది.


