పలకని చిలుక | Parrot Foutune Tellers Disappearing Village Tradition | Sakshi
Sakshi News home page

పలకని చిలుక

Jul 2 2026 11:21 AM | Updated on Jul 2 2026 12:40 PM

Parrot Foutune Tellers Disappearing Village Tradition

వికారాబాద్‌: ఒకప్పుడు గ్రామాల్లో చిలుక జోస్యం చెప్పేవారి వచ్చేరంటే సందడిగా ఉండేది. చిలుక తేసే కార్డులో తమ భవిష్యత్‌ ఉంటుందని భావించేవారు. అయితే కాలం మారింది. సాంకేతికత పెరిగింది. చేతిలోకి స్మార్ట్‌ ఫోన్‌ వచ్చే సరికి చిలుక జోస్యానికి ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఇతరుల భవిష్యత్‌ చెప్పిన ఆరెగొందిలీలు నేడు వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.  

చిలుక జోస్యానికి పెట్టింది పేరు ఎక్మాయి 
బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామం సంచారజాతి ఆరెగొందిలీలకు పెట్టింది పేరు. ఈ గ్రామాని కి చెందిన వేలాది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు వెళ్లి దశాబ్దాలుగా చిలుక జోస్యం చెబుతూ జీవనం సాగిస్తున్నా రు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్ణాటకలో బల్లారి, రాయచూరు, కలబురిగి, బీదర్, అలాగే మహారాష్ట్రలో సోలాపూర్, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో ఈ కుటుంబాలు స్థిరపడ్డాయి. ఒకప్పు డు చిలక జోస్యం వారి కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా ఉండేది. ప్రస్తుతం ఈ వృత్తికి ఆదరణ తగ్గిపోవడంతో యువత ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటోంది. కొందరు వ్యవసాయ కూలీలుగా, మరికొందరు ఆటోలు నడుపుతూ, చిన్న వ్యాపారాలు, భవన నిర్మాణ పనులు, ఇతర కూలీ వృత్తుల్లో జీవనం సాగిస్తున్నారు. 

ఏరువాక పౌర్ణమికి.. 
ఆరెగొందిలీల జీవన విధానం ఇప్పటికీ సంచార స్వభావానిదే. సంవత్సరంలో ఎక్కువ కాలం వివిధ ప్రాంతాల్లో గడిపే వీరు ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్వగ్రామమైన ఎక్మాయికి చేరుకుంటారు. తమ కులదైవమైన తుల్జాభవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ఎక్కడ నివసించినా తమ మూలాలను మరువకుండా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సంచార జీవనం కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. శాశ్వత నివాసం, గుర్తింపు పత్రాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించాలని కోరుతున్నారు. 

స్థిరపడిన ప్రాంతంలోనే ఓటర్లుగా నమోదు 
భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుంటున్నారు. స్థిర నివాసం లేకపోవడంతో కొందరు స్వగ్రామంలో ఓటర్లుగా కొనసాగలేకపోతున్నారు. ఎక్మాయి కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 3 వేల కుటుంబాలకు చెందిన సుమారు 11 వేల మంది ఆరెగొందిలీలు జీవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంప్రదాయ వృత్తి క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక గుర్తింపు కలి్పంచి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, గృహాలు, విద్య, సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement