మధ్యవర్తిత్వం మాటే లేదు | No proposal for India-Pak mediation by the US during Operation Sindoor | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వం మాటే లేదు

Jun 19 2025 5:58 AM | Updated on Jun 19 2025 5:58 AM

No proposal for India-Pak mediation by the US during Operation Sindoor

పాక్‌తో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు

ట్రంప్‌కు తేల్చిచెప్పిన ప్రధాని మోదీ

ట్రంప్‌తో మోదీ టెలిఫోన్‌ సంభాషణ

కననాస్కీస్‌(కెనడా): ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన పరస్పర సైనిక చర్యల ముగింపు పర్వంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాక్‌తో పోరులో శాంతిస్థాపన కోసం తానే చొరవ తీసుకుని ఇరుదేశాల మధ్య ఆపానని ట్రంప్‌ పదేపదే ప్రకటించుకోవడం, అమెరికా జోక్యంపై విపక్షాలు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ మాట్లాడటం విశేషం. 

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ట్రంప్‌తో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. అత్యవసరంగా, అర్ధంతరంగా జీ7 భేటీ నుంచి ట్రంప్‌ నిష్క్రమించిన నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ మంగళవారం ఫోన్‌లో సుదీర్ఘంగా సంభాషించారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ చెప్పారు. ట్రంప్‌తో మోదీ సంభాషణ వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు. 

‘‘ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత వెనువెంటనే భారత్, పాక్‌ మధ్య మొదలైన పరస్పర కాల్పుల ఉదంతంలో ఇరుదేశాల మిలిటరీ విభాగాల చర్చల తర్వాత దాడులు ఆగాయి. ఇందులో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు. అయినా మూడోవర్గం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్‌ అభ్యర్థించడం వల్లే భారత్‌ కాల్పుల విరమణకు ఒçప్పుకుంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగానే భావించబోం. ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తాం’’ అని ట్రంప్‌కు మోదీ స్పష్టంచేశారు.

వాణిజ్య అంశాల ఊసేలేదు
యుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యాన్ని ఆపేస్తానని భారత్‌ను ట్రంప్‌ బెదిరించారని వచ్చిన వార్తలపై మోదీ ట్రంప్‌కు స్పష్టతనిచ్చారు. ‘‘ ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాల్లో అమెరికా అస్సలు జోక్యంచేసుకోలేదు. భారత్, పాక్‌ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా అందలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ భారత్‌–అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రస్తావన అస్సలు లేదు. భారత్‌ ఇంతకుముందుగానీ ఇకమీదటగానీ మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగానూ అంగీకరించే ఆస్కారంలేదు.

 ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా భారత్‌లో ఏకాభిప్రాయం ఉంది. మే9వ తేదీ రాత్రి మీ దేశ ఉపాద్యక్షుడు జేడీ వాన్స్‌ నాకు ఫోన్‌చేశారు. పాకిస్తాన్‌ ప్రతిదాడులకు సంసిద్ధ్దమవుతోందని నాతో అన్నారు. అదే నిజమైతే పాక్‌కు కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టంచేశా. మే 9 అర్ధరాత్రిదాటాక పాకిస్తాన్‌లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులుచేసి నాశనం చేశాం. మా దాడుల్లో వాళ్ల సైనిక ఎయిర్‌బేస్‌లు బద్దలయ్యాయి. నిరుపయోగంగా మారాయి. దీంతో దిక్కుతోచక మాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే తొలుత అభ్యర్థించారు’’ అని ట్రంప్‌తో మోదీ చెప్పారు.

అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్‌
35 నిమిషాలకుపైగా జరిగిన ఈ టెలిఫోన్‌ సంభాషణలో చివర్లో మోదీని ట్రంప్‌ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోదీని ట్రంప్‌ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్‌కు మోదీ సుతిమెత్తగా చెప్పి అభ్యర్థనను తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement