Mixing Covid-19 Vaccines Not A Good Idea: New Study Hints At More Side Effects But No Safety Concerns - Sakshi
Sakshi News home page

రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..!

May 13 2021 6:44 PM | Updated on May 13 2021 9:21 PM

New Study Hints Mixing Covid Vaccines Not A Good Idea - Sakshi

రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను తీసుకోవడం వల్ల 

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా.. అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇలా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. కాకపోతే ఇవి తర్వగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ మాథ్యూ స్నేప్‌ పేర్కొన్నారు.

 830 మందిపై ప్రయోగాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్ని రెండు డోసులుగా తీసుకోవాల్సినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది.

వేర్వేరు టీకాలతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ..
ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి అని తెలిపింది. ఆస్ట్రాజెనికా తొలి డోసు, ఫైజర్‌ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయి. 

ఇక ఫైజర్‌ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్‌లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

టీకాలను మార్చి తీసుకోవద్దు..
ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్‌తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్‌ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement