Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి | Nepal will Resolve Border Issue Through Talks | Sakshi
Sakshi News home page

Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి

Jul 23 2024 7:34 AM | Updated on Jul 23 2024 7:34 AM

Nepal will Resolve Border Issue Through Talks

నేపాల్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన  నేపాల్‌ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్‌కు చెందుతుంది.

ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్‌-ఎంయూఎల్‌) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement