న్యూఢిల్లీ: ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా భౌతికకాయాన్ని పర్వతం నుంచి కిందకి తీసుకువస్తున్నట్లు అల్పైన్ క్లబ్ ప్రకటించింది. ఆయనతో పాటు మరో నలుగురు మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర పాకిస్థాన్లోని ప్రపంచ అత్యుత్తమ శిఖరాలలో ఒకటైన బ్రాడ్ పీక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది బృంద సభ్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై అల్పైన్ క్లబ్ జనరల్ సెక్రటరీ అయ్యాజ్ షిగ్రి మాట్లాడుతూ.." నిర్మల్ పుర్జా, మరో ఇద్దరు నేపాల్ జాతీయులు, ఒక చైనా దేశస్థుడితో కలిపి మొత్తం నాలుగు మృతదేహాలను గ్రౌండ్ రెస్క్యూ టీమ్ పర్వతం కిందకు తీసుకువస్తున్నారు.మరింత ఎత్తైన ప్రాంతంలో మరో మృతదేహం ఉన్నట్లు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అయితే అత్యంత ప్రమాదకరమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు" అని ఆయన స్పష్టం చేశారు.
కాగా నేపాల్కు చెందిన నిర్మల్ పూజా పర్వాతారోహనలో ఎన్నో రికార్డులను అవలీలగా తన ఖాతాలో వేసుకున్నారు. పీవోకేలో బ్రాడ్వీక్ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో భారీ హిమపాతంలో చిక్కుకుని దురదృష్టవశాత్తు మృత్యువాతపడ్డారు.ఈ విషయాన్ని శనివారం ఆయనకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్ ఎక్స్పెడ్ అధికారికంగా ధృవీకరించింది.
2026 జూలై 30(గురువారం) మధ్యాహ్నం సమయంలో నిర్మల్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ బృందం క్యాంప్-2 నుండి క్యాంప్-3కి వెళ్తుండగా దాదాపు 7 వేల మీటర్ల ఎత్తులో భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో నిర్మల్తో పాటు అమెరికా, ఒమన్, నేపాల్కు చెందిన పర్వతారోహకులు, గైడ్లు అందరూ మరణించారు.
నిర్మల్ పూజా విజయాలు
ప్రపంచంలోని 14 అత్యంత ఎత్తైన 8,000 మీటర్ల శిఖరాలను అతి తక్కువ సమయంలో (6 నెలల 6 రోజుల్లో) అధిరోహించిన ఘనత నిర్మల్ నిమ్స్ది.
8,000 మీటర్ల కంటే ఎత్తైన శిఖరాలను ప్రపంచంలోనే అత్యధిక సార్లు (దాదాపు 57 సార్లు) అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు
సప్లిమెంటల్ ఆక్సిజన్ (కృత్రిమ ఆక్సిజన్) సహాయం లేకుండానే 8,000 మీటర్ల శిఖరాలను అత్యధిక సార్లు విజయవంతంగా అధిరోహించిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది.
బ్రిటిష్ సైన్యంలోని గూర్ఖా బ్రిగేడ్ మరియు స్పెషల్ బోట్ సర్వీస్ (SBS) ప్రత్యేక బలగాలలో సేవలందించారు.
శీతాకాలంలో మొదటిసారిగా K2 శిఖరాన్ని అధిరోహించిన బృందంలో సభ్యులు
2021 జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'కే2' (K2) పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 10 మంది బృందానికి ఆయన నాయకత్వం వహించారు. అప్పటివరకు వింటర్ సీజన్లో K2 పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలైన ఎవరెస్ట్, లోట్సే మరియు మకాలు శిఖరాలను కేవలం 48 గంటల్లో అధిరోహించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు
ఈ ఏడాది మే నెలలో పుర్జా అదనపు ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ మరియు లోట్సేలను అత్యంత వేగంగా దాటిన తన స్వంత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.
ఆయన కేవలం 13 గంటల్లో ఎవరెస్ట్ శిఖరం నుండి లోట్సే శిఖరానికి చేరుకున్నారు.


