ఖాట్మండు: దేశం అత్యంత కష్ట సమయంలో ఉండగా సహకరించినందుకు భారత్కు నేపాల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. వరద సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేసినందుకు నేపాల్ భారత్, చైనాలకు ధన్యవాదాలన్నారు. ఈ రోజు బుధవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ, రెండు పొరుగు దేశాలు సకాలంలో సహాయక సామగ్రి, సాంకేతిక బృందాలతో పాటు అత్యవసర సహాయాన్ని నేపాల్కు అందించాయని తెలిపారు.
కాగా ఇటీవల నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగుదేశమైన భారత్ వెనువెంటనే నేపాల్కు ఆపన్న హస్తం అందించింది. భారతదేశం ఐదవ విడత సహాయ సామాగ్రిని పంపింది. భారత బృందాలు సొరంగాలలో గాలింపు చర్యలలో సహాయం చేస్తూ మృతదేహాలను గుర్తించడంలో సహకరిస్తున్నాయి.
నేపాల్ వరదల కారణంగా ఇప్పటివరకు 1,127 మంది ప్రాణాలు కోల్పోగా, 4,800 మందికి పైగా గల్లంతయ్యారు. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులలోని కార్మికులు సైతం గల్లంతయ్యారు. మరికొంతమంది సొరంగాలలో చిక్కుకుని ఉండవచ్చని భయపడుతున్నారు. ఈ విపత్కర సమయంలో భారత్ నేపాల్కు అపన్నహస్తం అందించింది. సహాయక చర్యల నిమిత్తం పలు కీలక సామాగ్రిని నేపాల్ పంపింది.
నేపాల్కు అండగా నిలిచిన భారత్
మొదటి C-130J విమానం దుప్పట్లు, టార్పాలిన్లు, పరిశుభ్రతా కిట్లు మరియు నిత్యావసర వస్తువులతో సహా సుమారు 10 టన్నుల సహాయ సామాగ్రిని అందించింది.
ఆగస్టు 27 – ఒక సి-17 గ్లోబ్మాస్టర్ విమానం సహాయక సామాగ్రి, మందులు మరియు ఆహార ప్యాకెట్లతో సహా 37.5 టన్నుల సహాయాన్ని అందించింది.
ఆగస్టు 28 – మూడవ విడతలో సుమారు 10 టన్నుల సహాయక సామగ్రి, 11 మంది సభ్యుల వైద్య మరియు సొరంగ-రెస్క్యూ నిపుణుల బృందాన్ని నేపాల్కు పంపింది.
ఆగస్టు 30 – నాల్గవ విమానం 11 టన్నుల సహాయ సామాగ్రితో పాటు, DNA ఫోరెన్సిక్ నిపుణులు మరియు సొరంగం రెస్క్యూ పరికరాలను అందించింది.
సెప్టెంబర్ 2 – 11 మంది సభ్యుల ప్రత్యేక సహాయక బృందం, అదనపు సాంకేతిక సహాయంతో కూడిన ఐదవ విమానాన్ని నేపాల్కు పంపారు. మృతదేహాలను గుర్తించడంలో సహాయపడటానికి భారత్ డీఎన్ఏ పరీక్ష నిపుణుల బృందాన్ని సైతం నేపాల్కు పంపింది.


