5 జిల్లాల్లో వరద బారిన పడ్డ 16 లక్షల మంది
కఠ్మాండు: నేపాల్ దిగువ ప్రాంతాలపై జలఖడ్గంతో దండయాత్ర చేసిన వరద విలయం ధాటికి జల సమాధి అయిన అమాయకుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నేపాల్ను ముంచెత్తిన మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 1,050కి పెరిగింది. భోటె కోశీ, త్రిశూలి నదీ ప్రవాహాల వెంట ఉన్న 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 12,000 మందిని కాపాడినప్పటికీ అన్వేషణ, సహాయక చర్యల్లో ఇంకా గుట్టలకొద్దీ మృతదేహాలు బురద మట్టిలో బయటపడుతున్నాయి. భద్రపరిచేందుకు సరిపడా ఫ్రీజర్లు లేక, బురదకొట్టుకుపోయిన దారుల్లో తరలించే ఆస్కారం లేక కొన్ని మృతదేహాలను సమీప కొండల్లోనే బుల్డోజర్లతో గోతులు తీసి కప్పేస్తున్నారు.
మరోవైపు ఆస్పత్రుల వద్ద మృతదేహాలు తమ వారివేనంటూ ఒకరికి మించి ఎక్కువ మంది బంధువులు రావడంతో అధికారులు మృతదేహాలతోపాటు అందరి డీఎన్ఏ శాంపిళ్లను తీసుకుంటున్నారు. దీంతో మృతదేహాల అప్పగింత సైతం ప్రహసనంగా మారింది. అంతెత్తున్న దూసుకొచి్చన బురద వరదలో గల్లంతైన వారి సంఖ్య మంగళవారానికి 4,400 దాటింది. వీరిలో 600 మందిదాకా విదేశీయులు, 83 మంది పోలీసులు, సైనికులు, సాయుధ సిబ్బంది ఉన్నారు. 5 జిల్లాల్లో 16 లక్షల మంది మెరుపు వరదలకు తీవ్రంగా ప్రభావితులయ్యారు.
బురద మట్టిని తొలగిస్తూ భారత సొరంగ నిపుణుల బృందం ఎట్టకేలకు ఛిలిమి సొరంగం, లాంగ్టాంక్ సొరంగంలో 185 మీటర్ల మేర లోపలికి వెళ్లేందుకు దారి సిద్ధంచేయగల్గిందని నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో 163 మంది భారతీయులను కాపాడి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ తెలిపారు. వేర్వేరు చోట్ల నదుల ప్రవాహ ఉధృతిని ప్రత్యక్షంగా చూసేందుకు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అధికారులు బిగించారు. తాజా పరిస్థితిపై నేపాల్ ఇందన శాఖ మంత్రి విరాజ్ భక్త శ్రేష్ట సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్వేషణ, సహాయక చర్యల్లో 21,300 మంది నిమగ్నమయ్యారు.


