హెలికాప్టర్‌ ప్ర‌మాదం.. ఇరాన్ అధ్య‌క్షుడి చివరి వీడియో వైరల్‌ | Last Visuals Of Iran President Raisi Before Chopper Crash Goes Viral | Sakshi
Sakshi News home page

Ebrahim Raisi: హెలికాప్టర్‌ ప్ర‌మాదానికి ముందు ఇరాన్ అధ్య‌క్షుడు వీడియో వైరల్‌

May 20 2024 1:25 PM | Updated on May 20 2024 4:36 PM

Last Visuals Of Iran President Raisi Before Chopper Crash Goes Viral

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్‌-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. 

ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.

కాగా తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్‌ మీడియా షేర్‌ చేసింది. ఇందులో రైసీ హెలికాప్ట‌ర్ కిటికీ నుంచి రైసీ బ‌య‌ట‌కు చూస్తున్న దృశ్యాలు  కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాప‌ర్‌లో వెళ్ల‌డానికి ముందు అధికారుల‌తో అధ్య‌క్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.  

రైసీ బయల్దేరిన 30 నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. దాదాపు 16 గంటల తర్వాత కొండ ప్రాంతంలో హెలికాప్టర్‌ శిథిలాలు గుర్తించారు. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్‌లో ఉన్నవారంతా దుర్మరణం చెందారు.

కుప్పకూలిన హెలికాఫ్టర్ ఇరాన్ అధ్యక్షుడు మృతి

తరువాతి అధ్యక్షుడు ఆయనే..
కాగా ఇబ్రహీం రైసీ మృతిచెందడంతో.. తదుపరి ఇరాన్‌ అధ్యక్షుడు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ మొఖ్బర్‌(69) తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే తొలుత  వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు.  దీనికి దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోదించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మొఖ్బర్‌,  పార్లమెంటరీ స్పీకర్‌, న్యాయ వ్యవస్థ చీఫ్‌ ఘోల్లమ్‌హోస్సేన్ మొహసేని ఎజీతో కూడిన కౌన్సిల్‌ 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement