బెర్నామా: లబువాన్ ఎయిర్పోర్టులో కలకలం రేపింది. రన్వేకు దాదాపు 200 మీటర్ల దూరంలో, కేరుపాంగ్ సమీపంలోని రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన స్థలంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటిదిగా భావిస్తున్న ఒక పాత బాంబు వెలుగులోకి వచ్చింది.దీంతో ఎయిర్పోర్టు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
కొద్ది రోజుల క్రితం (జూన్ 26) కూడా ఇదే ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి కొన్ని బాంబులు బయటపడటంతో విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలగగా, ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో ఈ తాజా బాంబు బయటపడింది. ప్రస్తుతం పోలీసులు, ఆర్ఎమ్ఎఎఫ్ సిబ్బంది కలిసి ఆ బాంబును అక్కడ నుండి సురక్షితంగా తరలించి, నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా లబువాన్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ వాన్ మొహమ్మద్ ఫిర్దౌస్ వాన్ జాకీ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, బాంబు నిర్వీర్యక బృందాలు దానిని సురక్షితంగా తొలగించే ప్రక్రియను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అనవసర భయాందోళనలు సృష్టించే ఎలాంటి ధృవీకరించని లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు.


