కీవ్ :రష్యా నుంచి చమురు కొనకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఆగే పరిస్థితులు లేవని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా జరుగుతున్న ఈ ఘర్షణను ఆపాలంటే ఇరు దేశాలు దౌత్యం, చర్యల సంప్రదింపుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పరోక్షంగా అమెరికా, ఉక్రెయిన్లకు చురకలింటించారు.
ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో 140 కోట్ల మందికి ఇంధనాన్ని అందించడంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకోవాలన్నారు. చమురు కొనుగోళ్ల విషయంలో ఉక్రెయిన్కు స్పష్టంగా దృక్కోణం ఉంటుందని దానిని భారత్ గౌరవిస్తుందని అదే విధంగా భారత్ దృక్కోణాన్ని సైతం ఇతరులు గౌరవించాలని ఆశిస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ "యుద్దం ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఎవరో చమురు, అల్యూమినియం, ఖనిజాలు, లోహాలు లేదా ఎరువులు కొనడం లేదా కొనకపోవడం వల్ల పరిష్కారం కాదు. ఈ వివాదం చర్చలు, దౌత్యం, సంప్రదింపుల ద్వారానే పరిష్కారమవుతుంది," అని అన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా గత నెలలో అధిక పన్నుల చట్టాన్ని చట్ట సభల్లో ప్రవేశపెట్టారు. రష్యా నుండి చమురు, గ్యాస్ను దిగుమతి చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే బిల్లును అమెరికా సెనేట్ లో ప్రవేశ పెట్టారు. అనంతరం దీనికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ వాణిజ్యం మాస్కో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుందని, సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని అధిక పన్నులు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
చమురు దిగుమతులు
కాగా యుద్ధం ప్రారంభానికి ముందు (2021) వరకు, భారతదేశ ముడి చమురు దిగుమతులలో రష్యా చమురు వాటా కేవలం 0.2 శాతంగా మాత్రమే ఉండేది. అయితే, 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి చేసిన తరువాత, పాశ్చాత్య దేశాలు మాస్కోను బహిష్కరించడంతో తక్కువ ధరకు లభించే రష్యా ముడి చమురుకు న్యూఢిల్లీ అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది.
భారతదేశం తన ముడి చమురులో సుమారు 88 శాతాన్ని విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది, దీనిని పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. అందులో మూడింట ఒక వంతు రష్యా నుండే వస్తుంది. భారతదేశ ముడి చమురు దిగుమతులలో 40 శాతానికి పైగా ఉంటుంది. క్లెప్లర్ డేటా ప్రకారం, ఆగస్టులో భారతదేశం రష్యా నుండి రోజుకు సుమారు 2.1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది.


