ఇస్లామాబాద్: గతేడాది పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైంది.కాగా ఇప్పుడు తాజాగా ఆ స్థావరాన్ని పునర్నిర్మించినట్లు వార్తకథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా దానిని మరింత హంగులతో నిర్మించేందుకు పాకిస్తాన్ భారీగానే నిధులు కేటాయించిందని సమాచారం.
2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ దాడి చేసింది. బహవల్పూర్లోని జామియా మస్జిద్ సుభాన్ అల్లాహ్పై జరిగిన దాడిలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మందితో పాటు, మరో నలుగురు సన్నిహిత సహచరులు మరణించారు. ఈ వివరాలు స్వయంగా మసూద్ అజర్ వెల్లడించారు. తాజాగా ఆస్థావరాన్ని పునర్నిర్మించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇండియా టుడే కథనం ప్రకారం.. దాడుల్లో దెబ్బతిన్న జైష్ స్థావరం ఇప్పుడు కొత్త మార్బుల్, తాజా పెయింట్, కొత్త ప్లాస్టర్తో తిరిగి పునరుద్ధరించబడింది. దాడుల వల్ల ఏర్పడిన నష్టం బయటకు కనిపించకుండా భవనాలను పూర్తిగా మరమ్మతులు చేసినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రధాన సముదాయానికి ఆనుకుని దెబ్బతిన్న నిర్మాణాలను కూడా తొలగించి, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
పునర్నిర్మాణానికి 25 కోట్ల పాకిస్థానీ కరెన్సీ?
కాగా ఈ స్థావరం పునర్నిర్మానం కోసం 25 కోట్ల పాకిస్థానీ రూపాయలను నగదు వాయిదాల రూపంలో అందించినట్లు భారత ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుతోంది. దాడుల సమయంలో ఏర్పడిన ప్రధాన హాల్లోని గుంతలను పూడ్చివేసి, దెబ్బతిన్న గోపురాలను తిరిగి నిర్మించినట్లు నివేదిక పేర్కొంది. దీనికోసమే సుమారు 11 కోట్ల పాకిస్థానీ రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఉగ్ర శిక్షణకు కేంద్రంగా స్థావరం
ఈ సముదాయం గతంలో ఉగ్రవాద భావజాల బోధన, శిక్షణకు కీలక కేంద్రంగా పనిచేసినట్లు నివేదిక తెలిపింది. ఇక్కడ ఉగ్రవాద నియామకులకు క్రమం తప్పకుండా ఆయుధాల వినియోగ శిక్షణ, శారీరక వ్యాయామాలు, మతపరమైన బోధనలు నిర్వహించేవారని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జైష్-ఎ-మొహమ్మద్తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కేంద్రాలను పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు తరలించినట్లు అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి.


