బీరుట్: లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకపడింది. ఈ రోజు (సోమవారం) దక్షిణ లెబనాన్లోని రెమాన్ నగరంలోని ఓ భవనంపై మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఈ వివరాలను ఆ లెబనాన్కు చెందిన నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.
ఆ దేశ మీడియా కథనాల ప్రకారం... సోమవారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని క్ఫర్ రెమాన్ పట్టణంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు అని కథనాలు ప్రచురించాయి. ఇదే పట్టణంలో మరో ఘటనలో ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ ఒక పౌర వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేసింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వైద్య సిబ్బంది మరణించినట్లు NNA తెలిపింది.
అదే విధంగా దేర్ అల్-జహ్రానీ పట్టణంలోని ఒక నివాస ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ సైన్యం రాత్రివేళ దాడి చేసిందని ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ముందుగా ప్రజలను ఆదేశించిందని తెలిపింది. కాగా ఈ దాడులకు ఒక రోజు ముందు, సమీపంలోని అరబ్ సలీమ్ పట్టణంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం ఏడుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ పట్టణం కూడా నబతియెహ్ జిల్లాలోనే ఉంది.
అయితే ఈ ఏడాది జూన్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ తరచుగా ఈ ఒప్పందం ఉల్లంఘన జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ తరచుగా లెబనాన్పై దాడులకు తెగబడుతుంది.


