టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. అల్ జజీరా కథనం ప్రకారం.. "నా తండ్రి రక్తం చిందేలా చేశారు.. నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మా దేశం కోరిక కూడా" అని చెప్పారు.
అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మందికి మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం శత్రువుకు గట్టి దెబ్బగా అని, అది చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1,000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులను కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు.
ఇరాన్పై ట్రంప్నకు వైరం ఎప్పుడు మొదలైంది?
ఈ వివాదం మూలాలు 2020 జనవరిలో ఉన్నాయి. అప్పట్లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ ఖాసిం సోలేమానీ మరణించారు.
ఆ సమయంలో సోలేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత అమెరికా సంస్థలు, ట్రంప్ను, ఆయన మాజీ అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చని పలుసార్లు ప్రకటించాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ట్రంప్ను ఇరాన్ చంపేసే ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి.
నిపుణులు ఏమంటున్నారు?
టెహ్రాన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోస్తఫా ఖోష్చెష్మ్ మీడియాతో మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి ఎప్పటి నుంచో ఇరాన్ నియంత్రణలోనే ఉందని, యుద్ధం తర్వాత దానిపై నియంత్రణ వదులుకోవడాన్ని ఇరాన్ ప్రజలు అంగీకరించరని చెప్పారు.
యుద్ధం సమయంలో హార్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయని, అది ఇరాన్ చేతిలో అత్యంత శక్తిమంతమైన ఒత్తిడి సాధనంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దేశీయంగా ఒత్తిడి పెరిగిందని, సైనిక బలాన్ని ఉపయోగించినా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవలేకపోయారని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఇరాన్కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, పైగా ఇంకా ఎక్కువ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.


