
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం
న్యూయార్క్/బీజింగ్/ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. రకరకాల యోగాసనాలు ఆచరించిన ఔత్సాహికులతో ప్రధాన నగరాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. పార్కులు, మైదానాలు కిక్కిరిసిపోయాయి. ఎటుచూసినా యోగాభ్యాసకులే కనిపించారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా 2014 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో రచయిత, ఆరోగ్య నిపణుడు దీపక్ చోప్రా నేతృత్వంలో యోగా వేడుకలు జరిగాయి. 1,200 మందికిపైగా దౌత్యవేత్తలు, అధి కారులు, ప్రవాస భారతీయులు, అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూయార్క్లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద యోగాసనాలు వేశారు. యునైటె డ్ కింగ్డమ్, చైనా, సింగపూర్, నేపాల్, జపాన్, మలేషియా, శ్రీలంక, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు.
కులమతాలతో సంబంధం లేదు: ముర్ము
భారత్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగాభ్యాసకులు ఉత్సాహం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాలుపంచుకున్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యోగాసనాలు వేశారు. యోగాకు కుల మతాలు, జాతులతో సంబంధం లేదని ఆమె చెప్పారు. భారతీయ శక్తికి యోగా ఒక ప్రతీక అని వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక సాధనంగా తోడ్పడుతుందని సూచించారు. మానసిక, శారీరక ఆరోగ్యగానికి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.