యువత దేశానికి అమూల్య సంపద | President Draupadi Murmu at the first convocation of Central University of AP | Sakshi
Sakshi News home page

యువత దేశానికి అమూల్య సంపద

Jul 2 2026 4:57 AM | Updated on Jul 2 2026 4:57 AM

President Draupadi Murmu at the first convocation of Central University of AP

వీరి శక్తి, ప్రతిభ, అంకితభావంతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం 

సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి జీవితాలు స్ఫూర్తిదాయకం  

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

డేటా సెంటర్, మల్టీమీడియా స్టూడియోకు శ్రీకారం

సాక్షి, అనంతపురం: సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తూ.. వినూత్న ఆలోచనలతో ముందుకు సాగే శక్తిశీలంగా ఉండే యువత భారత్‌కు అమూల్యమైన సంపద అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అనంతపురం శివారులోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ తొలి స్నాతకోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజిటర్‌ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వికసిత్‌ భారత్‌ సాధనకు యువతలోని శక్తి, ప్రతిభ, అంకితభావమే కీలకమని చెప్పారు. 

అనంతపురంలో లెక్చరర్‌గా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, అనంతపురం జిల్లా వాసి నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతులుగా దేశానికి సేవలందించి ఖ్యాతి దక్కించుకోవడం గర్వకారణమన్నారు. వారి స్ఫూర్తిదాయకమైన జీవితం మనందరికీ మార్గదర్శకమన్నారు. దేశంలో సాంకేతిక పురోగతి వేగంగా ఉందని, ఇది అన్ని రంగాల్లోనూ విశేషమైన ప్రగతికి బాటలు వేస్తోందన్నారు. నేర్చుకోవాలనే తపన, నూతన ఆవిష్కరణలు చేయాలనే పట్టుదలతో యువత ఉండడం దేశానికి శుభపరిణామమన్నారు. 

ఈ స్నాతకోత్సవం విద్యార్థుల కఠోర శ్రమ, పట్టుదలకు నిదర్శనంగా ఆమె అభివరి్ణంచారు. తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజ మద్దతుతో ఈ విజయాన్ని సాధించారన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. ఉద్యోగ సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, నూతన ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలుగా, ప్రజల శ్రేయస్సుకు తపించే ప్రభుత్వ ఉద్యోగులుగా, సమాజ సేవచేసే దాతలుగా, అణగారిన వర్గాలకు విద్యను అందించే అత్యుత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదగాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. డేటా సెంటర్, మల్టీమీడియా స్టూడియోను ప్రారంభించారు. 

విద్యా హబ్‌గా ‘అనంత’: గవర్నర్‌ 
గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ.. ఎస్కేయూ, జేఎన్‌టీయూ (ఏ),  శ్రీ సత్యసాయి హయ్యర్‌ లెర్నింగ్‌ ఇన్‌స్టిట్యూట్, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, వందేళ్ల చరిత్ర గల ఆర్ట్స్‌ కళాశాల, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ వంటి సంస్థలు ఏర్పడి అనంతపురం నగరం విద్యా హబ్‌గా మారిందని చెప్పారు. సామాజిక, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా వినూత్న విద్యా కార్యక్రమాలు అందిస్తున్న సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ రానున్న కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. 

విద్యార్థుల ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని బహుళ విభాగాల కోర్సులను ప్రవేశపెట్టడం సంతోషదాయకమన్నారు. ‘మీరు అనంత శక్తి స్వరూపులు.. మీరు ఏమైనా సాధించగలరు.. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్ద’ని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రులు లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ ఆచార్య, వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఏ కోరి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వీసీ యూనివర్సిటీ ప్రగతిని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement