
ఈ ఏడాదిలో నాలుగో ఘటన
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా నగరంలో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 10న గ్రీన్వుడ్ నగరంలోని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయంలో ఈ ద్వేషపూరిత చర్య జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. షికాగోలోని భారత కాన్సులేట్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది.
‘ఇండియానాలోని గ్రీన్వుడ్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయం ప్రధాన సైన్బోర్డును అపవిత్రం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం’ అని ఎక్స్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ‘ఐక్యత–సంఘీభావం’ కార్యక్రమం నిర్వహించింది. గ్రీన్వుడ్ మేయర్ సహా భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాన్సులర్ జనరల్ మాట్లాడారు. హిందూ సమాజం మరింత బలోపేతమవ్వాలన్న విషయాన్ని ఈ ఘటన గుర్తు చేసిందన్నారు. దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.