చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్‌మెంట్‌ రద్దుతో భారత్‌ ప్రతీకారం? | India Terminates Trans Shipment Facility For Bangladesh | Sakshi
Sakshi News home page

చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్‌మెంట్‌ రద్దుతో భారత్‌ ప్రతీకారం?

Apr 10 2025 7:11 AM | Updated on Apr 10 2025 10:15 AM

India Terminates Trans Shipment Facility For Bangladesh

న్యూఢ్లిల్లీ: భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అందిస్తున్న  కీలక ట్రాన్స్‌షిప్‌మెంట్ (Transshipment) సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సౌలభ్యాన్ని  భారత్‌ 2020లో బంగ్లదేశ్‌కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి, అక్కడ నుండి మూడవ దేశాలకు రవాణా చేసేది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.

భారత ఎగుమతులకు ఆటంకం
ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారతదేశం ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవులలో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు, భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

అసలు కారణం ఇదే..
అయితే భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) ఇటీవల చైనాలో పర్యటించి, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్‌లాక్డ్ (భూపరివేష్టిత) ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన  అలజడిని రేపాయి. దీనికి ప్రతిగానే భారత్‌ ఈ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు.

అమెరికా సుంకాలకు తోడుగా..
భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ (Readymade garment industry) దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు ఇది మరో ఆర్థిక దెబ్బగా  మారింది.

బంగ్లాకు ఆర్థిక సవాళ్లు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది ఈశాన్య ప్రాంత భద్రతను కాపాడటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను సూచిస్తున్నదని పేర్కొన్నారు. భారత దుస్తుల ఎగుమతి పరిశ్రమ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. కాగా ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యం రద్దు భారత్‌- బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ ఇకపై తమ దేశ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టనుంది.

ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement