పనామా సిటీ: రాజకీయంగా, భౌగోళికంగానూ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన పనామా కాలువ పగ్గాలను చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ చేపట్టారు. నావల్ ఇంజినర్ ఇల్యా ఎస్పినో మరోట్టా సోమవారం పనామా కెనాల్ అడ్మినిస్ట్రేషన్ లీడ్గా బాధ్యతలు చేపట్టారు. దశాబ్ద కాలంగా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ గా ఇల్లా ఎస్పినో వందల కోట్ల డాలర్ల విలువైన కెనాల్ విస్తరణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆమె పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది. 1999లో అమెరికా ఈ కెనాల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ముగ్గురు పనామావాసులు మాత్రమే పూర్తిస్థాయి అడ్మిని్రస్టేటర్లుగా పనిచేశారు. పనామా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచవ్యాప్త సముద్ర వాణిజ్యంలో మూడు శాతం భాగస్వామ్యమున్న ఈ కెనాల్ అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు.
పదవీబాధ్యతలు చేపట్టేందుకు కొంత సమయం ముందు ఇల్యా ఎస్పినో అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ కెనాల్ పరీవాహక పరిధిలోనే ఓ భారీ రిజర్వాయర్ నిర్మించాలన్నది అడ్మినిస్ట్రేటర్ గా తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియో నదీ బేసిన్లో 150 కోట్ల డాలర్లతో నిర్మించతలపెట్టిన ఈ రిజర్వాయర్ మధ్య అమెరికా దేశాల తాగునీటి అవసరాలను యాభై శాతం వరకూ తీర్చగలదు. భవిష్యత్తులో పనామా కెనాల్ కార్యకలాపాలకు కూడా ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుందని అంచనా. అమెరికా 1914లో ఈ కెనాల్ను ప్రారంభించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.


