మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా లైసెన్స్ పొందిన ట్యాక్సీలు నేరుగా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సేవలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
బహ్రెయిన్, సౌదీ అరేబియా రవాణా అధికారులు పరస్పర సమన్వయంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల పౌరులు, నివాసితులు, పర్యాటకులు ఇకపై సొంత వాహనాలపై ఆధారపడకుండా ట్యాక్సీల ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. అలాగే, రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.
అయితే కాజ్వే మీదుగా నడిచే ట్యాక్సీలకు కొన్ని నిబంధనలు విధించారు. నిర్దేశించిన సాంకేతిక, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించే లైసెన్స్ పొందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్యాక్సీ వాహనం ఐదేళ్లకు మించి పాతది కాకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో కింగ్ ఫహద్ కాజ్వేపై ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య ట్యాక్సీ రాకపోకలు పెరగడం వల్ల వాణిజ్యం, రిటైల్ వ్యాపారం, పర్యాటకం, ఎగ్జిబిషన్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బహ్రెయిన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనం లేని వారు బహ్రెయిన్ నుంచి సౌదీకి, అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్కు సులభంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.


