
2024లో అర డిగ్రీ పెరుగుదల
పెరిగిపోతున్న సముద్రమట్టం
ప్రమాద ఘంటికలే: ఐరాస
‘ఎండ దెబ్బ’కు మహాసముద్రాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలతో కూడిన వాయవ్య పసిఫిక్ ప్రాంత సముద్ర జలాల్లో 2024లో రికార్డు స్థాయిలో ఏకంగా అర డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పసిఫక్ మహాసముద్ర జలాలు ఏకంగా 4 కోట్ల చదరపు కి.మీ. మేరకు కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కిపోయాయి. ఆ పరిధిలోని జీవజాలాన్ని కూడా ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేసింది.
అరుదైన కోరల్ రీఫ్స్ వంటివాటి ఉనికే ప్రమాదంలో పడింది. అంతేగాక ఇండొనేసియాలోని న్యూ గినియా దీవుల్లో ఉన్న ఆ ప్రాంతపు ఏకైక గ్లేసియర్ ఏడాదిలోనే సగం మేరకు కరిగిపోయింది. ఎండలు ఇలాగే పెరిగిపోతే మరో ఏడాదికల్లా అది పూర్తిగా మాయం కావడం ఖాయమని ఐరాస వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జోస్యం చెప్పింది.
ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ల్లో గతేడాది ఎండలు సరికొత్త రికార్డులు సృష్టించాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రపంచమైన ఎండల నడుమ వాయవ్య పసిఫిక్ ప్రాంత దేశమైన ఫిలిప్పీన్స్పై గత అక్టోబర్, నవంబర్ నెలల్లో లెక్కలేనన్ని తుపాన్లు విరుచుకుపడ్డాయి! ఈ విపరిణామాలన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం’’ అంటూ వాపోయింది. మొత్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా 2024లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అధ్యయనకర్తల్లో ఒకరైన బ్లెయిర్ ట్రెవిన్ వివరించారు.
‘‘మొత్తం పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతను చూసుకున్నా 2022 తర్వాత రెండో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది! అక్కడి సముద్రమట్టాలు ప్రపంచ సగటుతో పోలిస్తే శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకర పరిణామాలే. ఎందుకంటే వాయవ్య పసిఫిక్ ప్రాంత జనాభాలో ఏకంగా సగానికి పైగా తీరానికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే నివసిస్తున్నారు’’ అని హెచ్చరించారు. సముద్రమట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే వారంతా అతి త్వరలో నిర్వాసితులుగా మారి పొట్ట చేత పట్టుకుని వలస పోవడం తప్ప మరో మార్గం ఉండదని అధ్యయన బృంద సభ్యుడు థియా తుర్కింగ్టన్ అభిప్రాయపడ్డారు.
– సాక్షి, నేషనల్ డెస్క్