యుద్ధం తక్షణమే ఆపండి | G7 leaders want to contain the Israel-Iran conflict | Sakshi
Sakshi News home page

యుద్ధం తక్షణమే ఆపండి

Jun 17 2025 5:20 AM | Updated on Jun 17 2025 5:20 AM

G7 leaders want to contain the Israel-Iran conflict

ఇజ్రాయెల్, ఇరాన్‌లకు జీ7 దేశాల అధినేతల వినతి

వెంటనే చర్చలు ప్రారంభించాలన్న డొనాల్డ్‌ ట్రంప్‌ 

కాల్గరీ: ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు సోమవారం కెనడాలో ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లా డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్‌ ప్రధానమంత్రి కియర్‌ స్టార్మర్‌ చెప్పారు. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్‌ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు. 

జీ7 ఇక జీ8 కావాలని.. జీ9 అయితే ఇంకా బాగుంటుందని పేర్కొన్నారు. కూటమిలో రష్యా, చైనా సైతం సభ్యదేశాలుగా చేరాలన్న తన ఆకాంక్షను ట్రంప్‌ వ్యక్తంశారు. జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా,చే యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంగళవారం జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు.           
 

Advertisement
 
Advertisement
Advertisement