అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు | Four Indian-Americans Wins In The 2024 US President Elections, Know About Their Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు

Jan 5 2025 5:45 AM | Updated on Jan 5 2025 10:53 AM

Four Indian-Americans Wins in the 2024 US President Elections

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్‌ దిగువసభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం సభలో అడుగుపెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులుకావడం విశేషం. 

గెలిచిన డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేతర, యూదుయేతర మతవిశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతాన్ని ఆచరించని వాళ్లు ముగ్గురు ఉన్నారు. హిందువులు సుహాస్‌ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, రో ఖన్నా, శ్రీ థానేదార్‌ తాజాగా ఎన్నికల్లో విజయపతాక ఎగరేయడం తెల్సిందే. 

భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్‌ ప్రమీలా జయపాల్‌ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్‌ దిగువసభ సీనియర్‌ సభ్యుడు డాక్టర్‌ అమీ బెరా దేవుడొక్కడే అనే విశ్వాసాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ‘‘12 ఏళ్ల క్రితం నేను దిగువసభలో ప్రమాణంచేసేటపుడు నేనొక్కడినే భారతీయఅమెరికన్‌ను. ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది’’అని అమీబెరీ అన్నారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీ కాగా 31 మంది(ఆరు శాతం) యూదు మతస్థులున్నారు. గెలిచిన రిపబ్లికన్‌ పార్టీ సభ్యుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.  

స్పీకర్‌గా మళ్లీ మైక్‌ 
52 ఏళ్ల మైక్‌ జాన్సన్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌గా మళ్లీ ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా కేవలం మూడు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన నెగ్గారు. గత వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా మైక్‌ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మైక్‌ బరిలో దిగారు. దిగువసభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈయనకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 మంది పడ్డాయి. డెమొక్రటిక్‌ సభ్యుడు హకీమ్‌ జెఫ్రీస్‌ సైతం మైక్‌కే ఓటేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్‌ వెంటనే స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement