జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం: ‘ఫైవ్ ఐస్’ హెచ్చరిక! | Chinese Spies Using LinkedIn to Target UK Officials | Sakshi
Sakshi News home page

జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం: ‘ఫైవ్ ఐస్’ హెచ్చరిక!

Jun 4 2026 8:20 AM | Updated on Jun 4 2026 8:58 AM

Chinese Spies Using LinkedIn to Target UK Officials

లండన్‌: బ్రిటన్ ప్రభుత్వ, సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకుని చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ ద్వారా ప్రమాదకరమైన గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు యూకే భద్రతా సంస్థ ‘ఎంఐ5’ హెచ్చరికలు జారీ చేసింది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లతో కూడిన ‘ఫైవ్ ఐస్’ ఇంటెలిజెన్స్ కూటమి సంయుక్తంగా ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. బీజింగ్ సైనిక ఇంటెలిజెన్స్ సర్వీసెస్  ‘ఆగ్రెసివ్’గా ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తూ, అత్యంత సున్నితమైన, రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది.

నకిలీ ఆఫర్ల మాయాజాలం
చైనా గూఢచారులు లింక్డ్‌ఇన్, ఇండీడ్, అప్‌వర్క్ వంటి ప్రముఖ ప్రొఫైల్, ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ఉద్యోగ ప్రకటనలను సృష్టిస్తున్నారు. ఫారిన్ పాలసీ అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు వంటి ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరుతో ప్రభుత్వ, సైనిక వ్యూహాత్మక సమాచారం ఉన్న అభ్యర్థులను ఆకర్షిస్తున్నారు. నిందితులు ప్రైవేట్ కన్సల్టెన్సీలు, థింక్-ట్యాంకులు లేదా హెచ్ఆర్ కంపెనీల ఉద్యోగులుగా నటిస్తూ, అభ్యర్థుల సీవీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

విచారణా విధానం - చెల్లింపులు
ఎంపిక చేసిన అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ, ప్రభుత్వ కాంటాక్ట్‌లు, సైనిక కార్యకలాపాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అనంతరం, చైనా అంతర్జాతీయ సంబంధాలపై నివేదికలు రాయాలంటూ ట్రయల్ టాస్క్‌లు ఇస్తున్నారు. నమ్మకం కుదిరిన తర్వాత, సీక్రెట్ సమాచారం కోసం ఒత్తిడి తెస్తూ, కమ్యూనికేషన్‌ను ఎన్‌క్రిప్టెడ్ యాప్స్‌లోకి మారుస్తున్నారు. ఈ నివేదికల కోసం పేపాల్, పేయనీర్, స్క్రిల్, వెస్ట్రన్ యూనియన్, క్రిప్టోకరెన్సీల ద్వారా వందల నుండి వేల డాలర్లను చేరవేస్తున్నారు.

టార్గెట్‌లో ఎవరున్నారు?
డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ రంగాల్లో భద్రతా క్లియరెన్స్ ఉన్నవారే ప్రధాన టార్గెట్‌గా ఉన్నారు. అలాగే ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఉన్న సైనిక సిబ్బంది, ప్రభుత్వ విధానాలపై అవగాహన ఉన్న అకడమిషియన్లు, జర్నలిస్టులు, థింక్-ట్యాంక్ ఉద్యోగులను కూడా చైనా ట్రాప్ చేస్తోంది. ఇలా అనధికారికంగా సమాచారాన్ని చేరవేసే వారు గూఢచర్య చట్టాల కింద కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. గతంలో ఇలాగే దాదాపు 20,000 మంది బ్రిటన్ పౌరులను చైనా ఏజెంట్లు సంప్రదించినట్లు ఎంఐ5 గుర్తించింది.

ఇది కూడా చదవండి: శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా?
 

Advertisement
 
Advertisement
Advertisement