
ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ పేరుతో ఇరాన్పై యూఎస్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ‘ మీరు చేస్తున్న దాడులతో ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించారు. ఇది చెడు సంకేతాన్ని సృష్టించారు’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు.
ఇప్పటికే యుద్ధం భీకర రూపం దాల్చిన తరుణంలో దాన్ని శాంతింప చేయాల్సింది పోయి.. అగ్నికి ఆజ్యం పోస్తారా? యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వాంగ్ యి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న యుద్ధంతో భవిష్యత్లో పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం బీజింగ్లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో జరిగిన సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో టెహ్రాన్లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రజలు కూడా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం.. టెహ్రాన్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. అటు రష్యాతో ఇప్పటికే చర్చలు జరిపిన ఇరాన్.. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
ఇరాన్కు సాయం చేస్తాం
ఇరాన్పై అమెరికా దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్పై అమెరికా దాడులను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము అండగా ఉంటామన్నారు.