
వాషింగ్టన్: టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు.
బెదిరిస్తే.. బెదిరిపోతామా
ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్లైన్పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.
మంచి పద్దతి కాదు
ట్రంప్ విధించిన 48గంటల డెడ్లైన్పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు.
మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్
మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది.