ఆర్మీచేతికి స్వదేశీ అస్మీ మెషీన్‌ పిస్టల్స్‌ | Army inducts ‘Asmi Pistol’ for close-quarter battles in J&K | Sakshi
Sakshi News home page

ఆర్మీచేతికి స్వదేశీ అస్మీ మెషీన్‌ పిస్టల్స్‌

Nov 6 2024 7:34 AM | Updated on Nov 6 2024 7:34 AM

Army inducts ‘Asmi Pistol’ for close-quarter battles in J&K

జమ్మూ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘అస్మీ’మెషీన్‌ పిస్టళ్లు భారత సైన్యం చేతికొచ్చాయి. ‘‘దేశ ఆత్మనిర్భరత కార్యక్రమానికి మరింత ఊతమిస్తూ 100 శాతం భారత్‌ తయారీ ఆయుధాన్ని ఇండియన్‌ ఆర్మీ తమ అమ్ములపొదిలోకి తీసుకుంది’’అని డిఫెన్స్‌ జమ్మూ విభాగం ప్రజావ్యవహారాల శాఖ మంగళవారం ‘ఎక్స్‌’లో ట్వీట్‌చేసింది. ఇండియన్‌ ఆర్మీ కల్నల్‌ ప్రసాద్‌ బన్సూద్‌తో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఈ పిస్టల్‌ను అభివృద్ధిచేసింది.

 ఈ పిస్టళ్లను హైదరాబాద్‌లోని లోకేశ్‌ మెషీన్స్‌ కర్మాగారంలో తయారుచేశారు. దీంతో కీలకమైన రక్షణ సాంకేతికలో భారత్‌ మరింత స్వావలంభన సాధించింది. అత్యంత చిన్నగా, తేలిగ్గా ఉండటం అస్మీ పిస్టల్‌ ప్రత్యేకత. శత్రువుతో అత్యంత సమీపం నుంచి పోరాడాల్సి  వచ్చినపుడు వేగంగా స్పందించేందుకు ఈ పిస్టల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ పిస్టల్‌గా, సబ్‌ మెషీన్‌గన్‌గా రెండు రకాలుగా వాడుకోవచ్చు.

 స్వల్ప, మధ్య శ్రేణి దూరాల్లోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో షూట్‌ చేయొచ్చు. అత్యంత వేడి, చలి వాతావరణంలోనూ ఏమాత్రం మొరాయించకుండా పనిచేస్తాయి. 8 అంగుళాల బ్యారెల్‌కు 33 తూటాల మేగజైన్‌ను అమర్చవచ్చు. 9ఎంఎం బుల్లెట్‌ను దీనిలో వాడతారు. తొలి దఫా 550 పిస్టళ్లను నార్తర్న్‌ కమాండ్‌ పరిధిలోని జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌ సరిహద్దులవెంట పహారా కాసే భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు అందజేశారు. వీటి తయారీ ఆర్డర్‌ను లోకేశ్‌ మెషీన్స్‌ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చారు.    

Advertisement
 
Advertisement
Advertisement