
వాషింగ్టన్: అమెరికా-చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇటీవల కాంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా.
జిన్పింగ్కు ట్రంప్ ఫోన్..
అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. జిన్పింగ్తో ట్రంప్ ఫోన్లో సంభాషించిన విషయాన్ని ఈరోజు(గురువారం) ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’లో వెల్లడించారు. “నాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం” అని ట్రంప్ పోస్ట్ చేశారు.
సంకాల ‘వార్’
సుంకాల ఆంక్షలతో చైనాను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశారు ట్రంప్. అయితే చైనా కూడా ట్రంప్ చర్యలకు ప్రతీ చర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘ భయపెడితే భయపోతాం అనుకుంటున్నారా.. చర్యకు ప్రతిచర్య సిద్ధం’ అంటూ సవాల్ చేశారు.
అక్కడ నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. చైనా వస్తువులపై 145 సుంకాన్ని ట్రంప్ విధించగా, అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని చైనా విధించింది. అయితే ఆ తర్వాత 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించగా, 125 శాతం సుంకాన్ని 10కి పరిమితం చేసింది చైనా . ఇలా ఇరు దేశాలు ఒక రాజీకి రావడంతో సమస్య తెరపడినట్లయ్యింది.