
దేశాల నేతలకు వివరిస్తున్న అఖిలపక్షం
లండన్/కౌలాలంపూర్/కైరో/మాడ్రిడ్: మానవాళి మనుగడకే ప్రమాదంగా మారిన ఉగ్రవాదంపై పోరుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని కేంద్ర ప్రభుత్వం పంపించిన అఖిల పక్ష బృందాల ప్రతినిధులు వివిధ దేశాల నేతలకు వివరిస్తున్నారు. బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ సారథ్యంలో లండన్ వెళ్లిన ప్రతినిధి బృందం యూకే మంత్రి కేథరిన్ వెస్ట్ను కలిశారు. ఉగ్రవాదంపై పోరాటంలో యూకే భారత్తో కలిసి వస్తుందని ఈ సందర్భంగా కేథరిన్ హామీ ఇచ్చారు.
ఇండో–పసిఫిక్ ప్రాంత స్థిరతకు భారత్ చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. బీజేపీ ఎంపీ బైజయంత్ జే పాండా సారథ్యంలోని బృందం ఆదివారం రాత్రి అల్జీరియా మంత్రి మహ్మద్ ఖౌనెతో భేటీ అయ్యారు. జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా సారథ్యంలో మలేసియా వెళ్లిన మరో బృందం కౌలాలంపూర్లో వివిధ పార్టీల ముఖ్య నేతలతో సమావేశమై, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించింది.
ఈజిప్టుకు ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలో వెళ్లిన బృందం ఈజిప్టు పార్లమెంట్ సభ్యులతో సమావేశమయ్యారు. సోమవారం డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలో స్పెయిన్ వెళ్లిన బృందం సభ్యులు మాడ్రిడ్లో విదేశాంగ మంత్రి జోస్ మాన్యు యెల్ అల్బరెస్తో చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని సహించరాదన్న భారత్ వైఖరిని తాము బలపరుస్తామన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సారథ్యంలోని బృందం లైబీరియాకు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆధ్వర్యంలోని అఖిలపక్ష బృందం బ్రెజిల్కు వెళ్లి, పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలను అక్కడి ప్రభుత్వాలకు వివరించాయి.