
35 మంది పాలస్తీనియన్ల మృతి
గాజా: గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను కొనసాగిస్తోంది. నగరంలోని షుజాయాలో బుధవారం ఇళ్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడుల్లో 35 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. 80 మంది జాడ తెలియడం లేదు. ఈ దాడుల్లో 10 భవనాలు ధ్వంసమయ్యాయి.
శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షిపణుల దాడిలో కొంతమంది శిథిలాల కింద నలిగిపోయారు. భారీ విధ్వంసంతో ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ప్రజల ఆర్తనాదాలు, కేకలతో ప్రాంతం మార్మోగింది. గాజా స్ట్రిప్లోని ఇతర ప్రాంతాలైన రఫా, ఖాన్యూనిస్, డెయిర్ అల్–బలహాŠ, బెయిట్ హనూన్లపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులు వెల్లువెత్తడంతో ఆస్పత్రులు, వైద్య సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సేఫ్జోన్గా పరిగణిస్తున్న అల్మవాసీని కూడా ఇజ్రాయెల్ వదల్లేదు. అక్కడ దాడులు తాము ఊహించలేదని బాధితులు వాపోతున్నారు. అయితే.. ఒక సీనియర్ హమాస్ నాయకుడిని లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం దాడి తెలిపింది. అతని పేరు వెల్లడించలేదు. పౌరులకు హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
గాజా భూముల్లో బఫర్జోన్ కోసం..
గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన నాటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు పునఃప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 1,500 మంది పాలస్తీనియన్లను చంపింది. వైమానిక దాడులతోపాటు క్షేత్రస్థాయిలో కూడా మారణహోమం సృష్టిస్తోంది. గాజా ప్రాంతాన్ని నేలమట్టం చేసి బఫర్ జోన్గా మార్చాలన్న ఆదేశాల ప్రకారం సైనికులు ముందుకెళ్తున్నారు. వ్యవసాయ భూములను, నివాస సముదాయాలను ధ్వంసం చేస్తున్నారు. అవసరమైతే అడ్డువచి్చనవారిపై కాల్పులు జరపాలన్న ఆదేశాలతో మారణకాండను కొనసాగిస్తున్నారు.
దక్షిణ గాజా స్ట్రిప్లోని జనసాంద్రత కలిగిన పాలస్తీనా నగరమైన రఫాను బఫర్జోన్గా మార్చాలని సైన్యం యోచిస్తున్నట్లు ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ బుధవారం నివేదించింది. నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతాలపై దాడి చేసిన సైనికులు.. వైద్యులు సహా పౌరులను విచక్షణారహితంగా హతమార్చారు. అనేకమంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. గాజా స్ట్రిప్ మీదుగా తూర్పు నుంచి పడమరకు విస్తరించి ఉన్న ఖాన్ యూనిస్, రఫాల మధ్య ‘మోరాగ్ అక్షం’గా పిలిచే ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు.