అణుహత్యలు! | 14 nuclear scientists death in Operation Rising Lion | Sakshi
Sakshi News home page

అణుహత్యలు!

Jun 30 2025 3:02 AM | Updated on Jun 30 2025 3:02 AM

 14 nuclear scientists death in Operation Rising Lion

14 మంది ఇరాన్‌ శాస్త్రవేత్తల హత్య

తామే చంపామని ప్రకటించిన ఇజ్రాయెల్‌

సైంటిస్టులపై దాడి కూడా యుద్ధ వ్యూహమే

80 ఏళ్లలో 100 మంది శాస్త్రవేత్తల దుర్మరణం

‘ఆ నాలుగే’ ప్రధాన హంతక దేశాలు

ఇరాన్‌ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్‌ 13న ఇజ్రాయెల్‌ ప్రారంభించిన ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’, కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్‌ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ‘ఇస్లామిక్‌ ఆజాద్‌ యూనివర్సిటీ’ అధిపతి అయిన  మొహమ్మద్‌ మెహదీ టెహ్రాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్‌ అబ్బాసి–దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇజ్రాయెల్‌ కానీ, మరో దేశంగానీ ఎందుకిలా అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి?! – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నేరుగా సైనికులతోనూ పోరాడరు.  ఆయుధాలకు ఆయువుపట్టులా ఉన్న శాస్త్రవేత్తలనూ లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణు స్థావరాల కంటే ముందు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉండే వ్యూహం ఒకటే. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్మూలించటం ద్వారా అణు కార్యక్రమాలను ముందుకు సాగకుండా నిలువరింపజేయటం, సంస్థాగతమైన ఆయువు పట్టును పూర్తిగా దెబ్బతీయడం. ఇరాన్‌  విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2020లో ఇరాన్‌ అణు సూత్రధారి మొహ్సేన్‌ ఫక్రిజాదేను చంపడం వెనుక ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ పన్నిన వ్యూహ లక్ష్యం కూడా సరిగ్గా ఇటువంటిదే.

ఇప్పటి వరకు 100 హత్యలు
అణు శాస్త్రవేత్తలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అన్నది ‘అణు’యుగం ప్రారంభం నుంచీ ఉన్నదే. 1944 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు శత్రుదేశాల దాడుల్లో హతమయ్యారు. అయితే ఈసారి ఇజ్రాయెల్, మునుపటి రహస్య కార్యకలాపాల మాదిరిగా కాకుండా, బహిరంగంగానే ఇరాన్‌ శాస్త్రవేత్తల్ని హతమార్చింది. ఇరాన్‌ అణు మౌలిక సదుపాయాలు, వాయుసేన రక్షణ వ్యవస్థలు, ఇంధన వనరులపైన కూడా చెప్పి మరీ ప్రత్యక్ష దాడులు జరిపింది.

నాలుగు  ‘హంతక’ దేశాలు
చరిత్రలో పొందుపరిచి ఉన్న వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో ప్రధానంగా నాలుగు దేశాలు తమ శత్రు దేశాలకు చెందిన తొమ్మిది వేర్వేరు అణు కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు దేశాలలో మొదటి వరుసలో ఇజ్రాయెల్, అమెరికా; రెండో వరుసలో బ్రిటన్, సోవియెట్‌ యూనియన్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్‌ల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తల్ని ఆ నాలుగు దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. 

తాజా ఇజ్రాయెల్‌ దాడు­లకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్నది సంబంధిత దేశంలోని శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘మోసాద్‌’ 1980 లో ఇటలీ ఇంజనీరు మారియో ఫియోరెల్లి ఇంటిపై బాంబు దాడి చేసి, ఇరాక్‌ అణు స్థావరాలకు కోసం పని చేస్తున్న ఐరోపా సంస్థలను పరోక్షంగా హెచ్చరించింది. 

ఏఐతో చంపేశారు
శాస్త్రవేత్తలను ‘మట్టుపెట్టటం’లో మునుప­టి విధానాలు మారిపోయాయి. గతంలో వ్యక్తులపై నేరుగా కాల్పులు, లేదంటే బాంబు దాడులు చేసేవారు. ఆ పద్ధతులే ఇప్పుడు మరింత అధునాతనంగా మారా­యి. ఉదాహరణకు, తాజా ఆపరేషన్  లో మరణించిన ఫెరేడౌన్   అబ్బాసి గతంలో 2010 కారు బాంబు దాడి నుండి బయటప­డిన వారే. ఇరాన్  కు చెందిన సుప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య అప్పట్లో ఓ సంచలనం. అతడి కదలికలపై ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్‌ 2019 నుంచీ నిఘా వేసింది. 

2020లో అతడి హత్య కోసం.. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఏఐను ఉపయోగించింది. ఒక టన్ను బరువు ఉండే రిమోట్‌ కంట్రోల్డ్‌ మెషీన్   గన్   ఇందుకోసం వాడారు. అత్యంత రహస్యంగా ఆ గన్   విడి భాగాలను ఇరాన్  లోకి తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అమర్చి, ఫక్రిజాదే ప్రయాణిస్తున్న దారిలో ఒక పాడుబడిన వాహనంలో ఉంచారు. అతడు భార్యతో సహా ప్రయాణిస్తుంటే.. కేవలం ఒక్కడికే గురిపెట్టారు. 

మొత్తం 15 బుల్లెట్ల­ను కేవలం నిమిషం వ్యవధిలో ప్రయోగించారు. కారులో అతడి పక్కను­న్న భార్యకు ఏమీ కాలేదట. హత్య జరిగిన మరుక్షణమే మెషీన్   గన్   ఉంచిన వాహనం కూడా పేలిపో­యి, అందులో ఎలాంటి ఆనవాలూ లభించలేదట. ఈ మొత్తం ఆపరేషన్  ను ఇరాన్   వెలుపల ఒక కమాండ్‌ సెంటర్‌ నుంచి నిర్వహించడం విశేషం.

చెప్పి చేయటం మొదలైంది!
సైనిక చర్యలతో పాటు, దౌత్యం, ఆంక్షలు, సైబర్‌ దాడులు, నిఘా కార్యకలాపాలు అన్నవి విస్తృతమైన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక వ్యూహంలో భాగంగా ఉంటాయి. అయితే ప్రధానంగా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే – దౌత్యపరమైన ప్రయత్నాలన్నిటినీ జాప్యం అయ్యేలా చేయటం, తద్వారా అణ్వస్త్రాల తయారీ ఖర్చులు పెరిగేలా చేయటం, అలాంటి కార్యక్రమాలకు ఇతరులకు సహకరించకుండా నిరోధించడం. 

ఎంత ప్రభావం ఉంటుంది?
శాస్త్రవేత్తలను హతమార్చటం అన్నది బలమైన సందేశాన్ని పంపుతుందని, శత్రువు దూకుడును  తగ్గిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఇటీవలి తన దాడులను ‘సామూహిక విధ్వంసక  ఆయుధాలను సమకూర్చుకునే సామర్థ్యానికి గట్టి దెబ్బ’గా అభివర్ణించింది. అయితే, ఇరాన్‌ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటూ ఉండొచ్చనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదే. 

ఒకరిద్దరు శాస్త్రవేత్తలను హతమార్చటం వల్ల అణ్వస్త్ర దేశ గమనం పెద్దగా మారకపోవచ్చు. పైగా ఇటువంటి హత్యలు నైతికమైన, చట్టపరమైన, మానవతాపరమైన ఆందోళనలను పెంచుతాయి. శాస్త్రవేత్తల హత్యలు వారిని అమరవీరుల స్థాయికి పెంచే అవకాశం ఉండటంతో అణు అభివృద్ధికి ప్రజల మద్దతు  లభించవచ్చు కూడా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement