
గొంతు.. చెవులు కోసి.. ఒంటికి నిప్పంటించి
మేడ్చల్: మేడ్చల్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి (50) మేడ్చల్ మండల పరిధిలోని అత్వెల్లిలో అద్దె గదిలో నివాసం ఉంటూ కిష్టాపూర్లోని ఓ మద్యం దుకాణంలో రోజువారీ కూలీగా పని చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఉంటున్న గదిలోంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చెవులు, గొంతు కోసి.. సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె ఒంటిపై దుస్తులు వేసి కాల్చివేసినట్టు గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ... మహిళ హత్య కేసు ఛేదించడానికి లోకల్, ఎస్వోటీ పోలీసులతో కలిపి ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళ ఒంటి మీదున్న నగలు, డబ్బుల కోసం నమ్మించి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారా?, గతంలో తనతో సహజీవనం చేసిన వ్యక్తి ఈ పని చేశాడా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నామన్నారు. కాగా.. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
మేడ్చల్ పరిధిలో మహిళ దారుణ హత్య
సగభాగం వరకు కాలిన మృతదేహం