
ఈసారి ‘బతుకమ్మ’ కుంటలోనే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రజలు వినియోగించుకోవడానికి సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. స్థానికులు బతుకమ్మ కుంటలోనే పండగ సంబరాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రంగనాథ్ బుధవారం అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. అభివృద్ధి పనులను స్థానికుల సమక్షంలో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు పునరుజ్జీవంతో పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చెరువు పూడికతీత ప్రారంభమైంది. ఆ నెల 18న జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఆపై కోర్టు వివాదం నేపథ్యంలో పనులకు బ్రేక్ పడగా.. బుధవారం మళ్లీ మొదలయ్యాయి. హైడ్రా కోసం ప్రత్యేక లోగో సిద్ధమైంది. ఇప్పటి వరకు అధికారులు జీహెచ్ఎంసీలో భాగంగా ఉండగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కోసం రూపొందించిన లోగోనే వినియోగించారు. తాజాగా హైడ్రా కోసం ఓ ప్రత్యేక లోగోను డిజైన్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైడ్రా ప్రధాన లక్ష్యం జలవనరుల పరిరక్షణ. ఈ థీమ్ ఉట్టిపడేలా లోగోను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖరారు చేశారు.
అభివృద్ధి పనులు పునఃప్రారంభంలో రంగనాథ్ వెల్లడి
హైడ్రా కోసం రూపొందించిన ప్రత్యేక లోగో సిద్ధం

ఈసారి ‘బతుకమ్మ’ కుంటలోనే..