Hyderabad Drugs case: నాడు రకుల్‌... నేడు అమన్‌! | - | Sakshi
Sakshi News home page

Hyderabad Drugs case: నాడు రకుల్‌... నేడు అమన్‌!

Jul 16 2024 11:04 AM | Updated on Jul 16 2024 3:36 PM

-

సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. గతంలో డ్రగ్స్‌ విక్రయం, వినియోగం ఆరోపణలపై అనేక మంది సినీ రంగానికి చెందిన వాళ్లు అరెస్టు అయ్యారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై ఈ తరహా ఆరోపణలే రాగా...తాజాగా సోమవారం ఆమె సోదరుడు అమన్‌ప్రీత్‌ సింగ్‌ డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు తేలడంతో అరెస్టు అయ్యాడు. ఇతడు మాదకద్రవ్యాలు ఖరీదు చేసిన పెడ్లర్స్‌ ముఠాలో అనేక మందిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు రాజేంద్రనగర్‌ పోలీసులు ప్రకటించారు.
 

పలువురిపై గతంలోనూ కేసులు...

సోమవారం చిక్కిన ఐదుగురు డ్రగ్‌ పెడ్లర్స్‌లో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన సూత్రధారి అయిన డివైన్‌ ఎబుక సుజీపై వివిధ నగరాల్లో ఏడు డ్రగ్‌ కేసులు ఉన్నాయి. ఇతడికి ప్రధాన ఏజెంట్‌గా ఉన్న అనోహ బ్లెస్సింగ్‌పై 2019లో ధూల్‌పేట ఎకై ్సజ్‌ పోలీసులు ఇలాంటి కేసే నమోదు చేశారు. పెడ్లర్స్‌లోఒకడైన నిజాం కాలేజీ విద్యార్థి అజీజ్‌ నోహీమ్‌ అడెషోలా (నైజీరియన్‌) గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. అప్పట్లో ఫీజు చెల్లించడం కోసం నకిలీ డీడీ తయారు చేసి ఇచ్చి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో కింది కోర్టు శిక్ష వేయగా.. ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశాడు. అల్లం సత్య వెంకట గౌతమ్‌పై కేపీహెచ్‌బీ ఠాణాలో మహిళను వేధించిన కేసు, వరుణ్‌ కుమార్‌పై బండ్లగూడకు చెందిన ఈవెంట్స్‌ కొరియోగ్రాఫర్‌ మహ్మద్‌ మెహబూబ్‌ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వరుణ్‌ కుమార్‌పై కేపీహెచ్‌బీలో, షరీఫ్‌పై జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ల్లో కేసులు ఉన్నాయి.

రకుల్‌ వ్యవహారం ఇలా...

నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారికి డ్రగ్స్‌ సరఫరా చేసిన కెల్విన్‌తో సహా మరికొందరిని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసులు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్‌) అప్పట్లో 10 మంది సినీ ప్రముఖులతో పాటు అనేక మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ జాబితాలో లేని రకుల్‌ పేరు ఆ తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో వెలుగులోకి వచ్చింది. 2020లో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈ వ్యవహారంలో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇందులో సుశాంత్‌ సింగ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఈమె విచారణతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తదితరులకు సమన్లు జారీ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్‌ హాజరయ్యారు. 2021 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ ఈడీ అధికారులు రకుల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.

కొకై న్‌ వినియోగదారుడిగా చిక్కిన అమన్‌...

టీజీఏఎన్‌బీ, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు సోమవారం చేపట్టిన ఆపరేషన్‌లో నైజీరియన్లు డివైన్‌ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌ సూత్రధారులుగా ఉన్న డ్రగ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ ఇద్దరూ పరారీలో ఉండగా...అనోహ బ్లెస్సింగ్‌, అజీజ్‌, గౌతమ్‌, వరుణ్‌, షరీఫ్‌లను అరెస్టు చేసి 199 గ్రాముల కొకై న్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో అమన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు కిషన్‌ రాఠి, అనికాంత్‌, యశ్వంత్‌, రోహిత్‌, శ్రీ చరణ్‌, ప్రసాద్‌, హేమంత్‌, నిఖిల్‌, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీళ్లు క్రమం తప్పకుండా తమ వద్ద నుంచి కొకై న్‌ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు నిందితులు బయటపెట్టారు. దీంతో గాలించిన సైబరాబాద్‌ పోలీసులు అమన్‌ ప్రీత్‌ సింగ్‌తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష చేయగా..వీళ్లు తరచు కొకై న్‌ వాడుతున్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన పోలీసులు వీరిని డ్రగ్స్‌ వినియోగదారులుగా చేర్చి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వినియోగదారుల్లోనూ సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు అమన్‌!1
1/1

నేడు అమన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement