'పార్టీని వీడొద్దు! మనం కలిసి మాట్లాడుదాం!!' : మంత్రి కిషన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

'పార్టీని వీడొద్దు! మనం కలిసి మాట్లాడుదాం!!' : మంత్రి కిషన్‌రెడ్డి

Sep 23 2023 6:22 AM | Updated on Sep 23 2023 8:11 AM

- - Sakshi

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి నేతల నుంచి వార్డు స్థాయి కార్పొరేటర్ల వరకు చేరుతుండటంతో నగరంలో ‘కారు’ లోడ్‌ పెరుగుతోంది. తాజాగా బీజేపీకి చెందిన దంపతులు పద్మ, వెంకట్‌రెడ్డిలు బీజేపీ నుంచి మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

వీరిలో పద్మ బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌గా కొనసాగుతుండగా, వెంకట్‌రెడ్డి రాష్ట్రస్థాయి నేతగా చెబుతున్నారు. వీరు బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం శుక్రవారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్‌ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం లభిస్తుందని కేటీఆర్‌ భరోసా ఇచ్చినట్లు ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు వెంకట్‌రెడ్డి దంపతులు డీడీ కాలనీలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం వివిధ దశల్లో శ్రమించినట్లు వారు పేర్కొన్నారు. తమకు సరైన ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడాల్సి వస్తోందని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

అనుకోకుండా కిషన్‌రెడ్డి ఫోన్‌..
పార్టీని వీడుతున్నట్లు వెంకట్‌రెడ్డి దంపతులు విలేకర్ల సమావేశంలో చెబుతుండగానే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సడన్‌గా వెంకట్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. పార్టీని వీడుతున్నట్లు సమాచారం అందిందని, మనం కలిసి మాట్లాడుదామని కిషన్‌రెడ్డి చెప్పగా.. దీనిపై వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. మీ స్పందన కోసం గత 15 రోజులుగా ఎదురు చూశానని, నిర్ణయం తీసేసుకున్నట్లు చెప్పారు. అంబర్‌పేటలో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఫోన్‌లో వెంకట్‌రెడ్డి విలేకరుల ముందే కిషన్‌రెడ్డిని కోరారు. తొందర పడవద్దని కిషన్‌రెడ్డి చెప్పగా.. నాకు 63 సంవత్సరాలు.. ఇంకేం తొందర అంటూ వెంకట్‌రెడ్డి సంభాషణ ముగించారు.

బీఆర్‌ఎస్‌ బలం 60..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి 56 మంది కార్పొరేటర్లుగా గెలవగా నలుగురు బీజేపీ కార్పొరేటర్లు బానోతు సుజాతానాయక్‌(హస్తినాపురం), అర్చనాప్రకాశ్‌(రాజేంద్రనగర్‌), డి.వెంకటేశ్‌(జూబ్లీహిల్స్‌), సునీతాప్రకాశ్‌గౌడ్‌(ఆడిక్‌మెట్‌)లు ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరారు.దీంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల బలం 61కి చేరినప్పటికీ, బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలిచిన ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ బలం 60గా ఉంది.

బీజేపీకి దెబ్బే..
ప్రస్తుతం చేరింది పద్మ, వెంకట్‌రెడ్డి దంపతులే అయినప్పటికీ, ఎన్నికల తరుణంలో ఎంతో ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రమంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి ఓటరుగా ఉన్న, గతంలో అసెంబ్లీ నుంచి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన వీరు బీఆర్‌ఎస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ చేరికలు కిషన్‌రెడ్డి సొంత ఇలాకా నుంచే కావడంతో ఎంతైనా ఇది బీజేపీకి దెబ్బేనంటున్నారు. బీజేపీని నిర్వీర్యం చేసేందుకు మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ వ్యూహంతోనే ఇది జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి అంబర్‌పేట ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించిన వెంకట్‌రెడ్డికి తగిన హామీ లభించకపోవడం..ఏకంగా కిషన్‌రెడ్డే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్న నేపథ్యంలో, తగిన పదవి ఇస్తామని బీఆర్‌ఎస్‌ నుంచి లభించిన హామీతోనే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరిట్లు తెలుస్తోంది.

బీజేపీ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన చెప్పడం సరికాదంటున్నాయి బీజేపీ శ్రేణులు. గతంలో ఆయన రెండు పర్యాయాలు గ్రేటర్‌ బీజేపీ అధ్యక్షునిగా పనిచేయడాన్ని, మలక్‌పేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించడాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. భార్యాభర్తలిద్దరికీ రెండేసి పర్యాయాలు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వగా ఒక్కో పర్యాయం ఓడిపోగా, ఒక్కో పర్యాయం గెలిచారని చెబుతున్నారు.

బర్కత్‌పురా డివిజన్‌నుంచి వెంకట్‌రెడ్డి కార్పొరేటర్‌గా పనిచేయగా, బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్‌గా పద్మావెంకట్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికల తరుణంలో జరిగే ఏ పరిణామమైనా ఎంతో ప్రభావం చూపుతుందని, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుని ఇలాకా నుంచి కావడం బీఆర్‌ఎస్‌కు కలిసే వచ్చే అంశమని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement