
హైదరాబాద్: ఓవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, భారీ బహిరంగసభ.. మరోవైపు బీజేపీ హైదరాబాద్ విమోచన సభ కోసం రెండు పార్టీల జాతీయ నేతలు నగరానికి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ది అవినీతి కోసం జరుగుతున్న వర్కింగ్ కమిటీ సమావేశమని, అవినీతికి పాల్పడే కాంగ్రెస్తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లుగా ‘కరప్ట్ వర్కింగ్ కమిటీ’, బివేర్ ఆఫ్ స్కాంగ్రెస్ స్కామర్స్ అని రాశారు. కాంగ్రెస్లోని దాదాపు పాతికమంది నేతలు ఆయా స్కామ్లలో ఉన్నట్లుగా పేర్కొంటూ వారి ఫొటోలు, పక్కన వారు పాల్పడ్డారన్నట్లుగా ఆయా స్కామ్ల పేర్లు రాశారు. మరోవైపు రెండు పార్టీలు తెలంగాణకు ఏమీ చేయలేదని, సీఎం కేసీఆర్ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సంధించిన ప్రశ్నలు ఇవీ..
► 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చేయలేదు. ఇప్పుడు కూడా ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అలాగే మోసగిస్తారా?
► పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్న సోనియాగాంధీ, రాహుల్గాంధీలు జాతీయ హోదా ఇవ్వడంలో ఎందుకు విఫలమయ్యారు?
► తెలంగాణలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 2016 వృద్ధాప్య పెన్షన్లు ఇస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీరు ఇస్తున్న పెన్షన్లు ఎంత?
► మీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రైతులకు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటున్నారు దానికి మీరు ఒప్పుకుంటున్నారా?
► గోవా లిబరేషన్ డేకు రూ. 300 కోట్లు ఇచ్చిన మోదీ సర్కార్ తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్డేకు ఒక్కరూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణకు వస్తున్న అమిత్ షా రాష్ట్రానికి మీరేమైనా ప్రకటిస్తారా ?
► శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నగరానికి వచ్చే మార్గంలో, తాజ్కృష్ణ పరిసరాల్లోని బంజారాహిల్స్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అమిత్షాను ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న బ్యానర్లు పరేడ్గ్రౌండ్, బేగంపేట ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. అమిత్షాను ప్రశ్నించే పోస్టర్లను ఎవరు వేశారో వివరాల్లేవు.
► కాగా.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగానూ కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ఫొటోలతో డీల్స్ కుదురును 30 శాతం కమిషన్తో అంటూ.. ‘స్కామ్ 2023’ సినిమా మంచి అనుభవం కోసం 3డీ (30 శాతం) గ్లాస్ కళ్లజోడు వాడండి అన్నట్లు పేర్కొంటూ కళ్ల జోడుతో ఉన్న కేసీఆర్ ఫొటోలతో ఈ పోస్టర్లు వెలిశాయి. బుక్మై షో స్థానే బుక్మై సీఎం అంటూ ముద్రించారు.