ఎల్‌బీ నగర్‌ అభ్యర్థిని మార్చండి.. నా భార్యకు మద్దతివ్వండి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌బీ నగర్‌ అభ్యర్థిని మార్చండి.. నా భార్యకు మద్దతివ్వండి

Sep 12 2023 5:46 AM | Updated on Sep 12 2023 8:26 AM

- - Sakshi

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం నుంచి తన భార్య, మాజీ కార్పొరేటర్‌ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న పోటీ చేస్తారని, ఈ పోటీలో విజయం తమదేనని ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ముద్దగౌని రాంమోహన్‌గౌడ్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్: ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం నుంచి తన భార్య, మాజీ కార్పొరేటర్‌ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న పోటీ చేస్తారని, ఈ పోటీలో విజయం తమదేనని ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ముద్దగౌని రాంమోహన్‌గౌడ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయనతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ కార్పొరేటర్లు వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌, సామ రమణారెడి, జిన్నారం విఠల్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యురాలు శాలిని, హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాతానాయక్‌లు బీఎన్‌రెడ్డినగర్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా నియోజక వర్గ కార్యకర్తలు తమ పోటీపై సందిగ్ధంలో ఉన్నారని, కానీ తాము ఎన్నికల బరిలో ఉంటామని రాంమోహన్‌గౌడ్‌ తెలిపారు.

అధిష్టానం స్పందించి ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని కోరారు. సుధీర్‌రెడ్డి పోటీ చేస్తే ఇక్కడ గెలవడం కష్టం అని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో అన్ని కాలనీల నుంచి కార్యకర్తలు, అభిమానులు పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీ ఫారం ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇప్పు డే అభ్యర్థిని మారిస్తే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అర్హులకు దళిత బంధు, బీసీబంధు రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు.

నియంతలా వ్యవహరిస్తున్నాడు..
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులను అణిచివేయడంతో పాటు నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తర్వాత ఒంటెద్దు పోకడలతో నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, ఎవ్వర్నీ ఎదగనీయడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా కాకుండా సుధీర్‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు.

బోరున విలపించిన కార్పొరేటర్‌..
కేసీఆర్‌, కేటీర్‌లపై నమ్మకంతో బీజేపీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన తనకు ఇక్కడ న్యాయం జరగడం లేదని, తనకు సుధీర్‌రెడ్డితో ప్రాణహాని ఉందని కార్పొరేటర్‌ సుజాతా నాయక్‌ బోరున విలపించారు. కక్ష సాధింపుతో హస్తినాపురం డివిజన్‌లో అభివృద్ధి అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.

సమావేశాలపై సమాచారం ఇవ్వడం లేదు..
పార్టీలో సీనియర్‌ నాయకులైన తమను ఎల్‌బీనగర్‌లో జరిగే ఏ సమావేశానికీ పిలవడం లేదని, సమాచారం ఇవ్వడం లేదని రాంమోహన్‌గౌడ్‌ ఆరోపించారు. ఆత్మగౌరవంతో పార్టీ కోసం పని చేస్తున్నామని, కార్యకర్తలను సుధీర్‌రెడ్డి పట్టించుకోకున్నా తాము కాపాడుకుంటున్నామని పేర్కొన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 11 డివిజన్‌లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాడని, అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. సుధీర్‌రెడ్డితో ఇమడలేకే వచ్చే ఎన్నికలలో తమ ఉమ్మడి అభ్యర్థిగా లక్ష్మీప్రసన్నగౌడ్‌ను పోటీలోకి దించుతున్నామని నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement