వ్యూహాల పల్లకిలో.. ప్రచారంలో గులాబీదళం.. | - | Sakshi
Sakshi News home page

వ్యూహాల పల్లకిలో.. ప్రచారంలో గులాబీదళం..

Aug 31 2023 5:52 AM | Updated on Aug 31 2023 7:41 AM

- - Sakshi

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ సన్నద్ధమవుతున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ ముందంజలో దూసుకుపోతోంది. మిగతా పార్టీలు ఇంకా అభ్యర్థులనే ఎంపిక చేయలేదు. కాంగ్రెస్‌లో దరఖాస్తులు పరిశీలనలో ఉండగా, బీజేపీలో ఆ కసరత్తే మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసి వారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే లోపునే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మూడు నాలుగు రౌండ్ల ప్రచారాన్ని పూర్తిచేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులుగా ప్రకటించిన వారు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు.

గ్రేటర్‌ పరిధిలో ఇద్దరు మినహా సిట్టింగ్‌ ఎమ్యెల్యేలే అభ్యర్థులు కావడంతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ తమనే గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. వివిధ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిందిగా అధికారులను పరుగులు తీయిస్తున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలవారికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు. కొత్తవాటికి శ్రీకారం చుడుతున్నారు. ఈనె నెలాఖరులోపే వివిధ కార్యక్రమాలు పూర్తిచేసే యోచనలో ఉన్నారు. డబుల్‌బెడ్రూం ఇళ్ల పంపిణీని తమకు అనుకూలంగా మల్చుకోనున్నారు.

కాంగ్రెస్‌లో ఆశావహుల ఎదురుచూపులు..
కాంగ్రెస్‌లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులు ఎదురు చూస్తున్నారు. టికెట్‌ తమకేననే ధీమాలో ఉన్నవారు ఎన్నికల సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. పదిరోజుల్లో మొదటి జాబితా వెలువడుతుందని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న అంజన్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, మధుయాష్కి గౌడ్‌, దర్పల్లి రాజశేఖరరెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నందికంటి శ్రీధర్‌, గొట్టిముక్కల పద్మారావు, రాగిడి లక్ష్మారెడ్డి, పి.విజయారెడ్డి, జువ్వాడి ఇందిరారావు, పి. విష్ణువర్ధన్‌రెడ్డి, మర్రి ఆదిత్యరెడ్డి, కోట నీలిమ, ఎం.డి ఫిరోజ్‌ఖాన్‌, ఆదం సంతోష్‌కుమార్‌, నోముల ప్రకాశ్‌గౌడ్‌, తదితరుల్లో ఎవరెవరికి టికెట్లు వస్తాయోననే ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించినా వెంటనే రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

బీజేపీలో సందిగ్ధత..
బీజేపీ ఇప్పటి వరకు టికెట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లను ఆశిస్తున్నవారు ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలనే తలంపుతో బీజేపీ నుంచి హేమాహేమీలు రంగంలో దిగనున్నట్లు చెబుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ నాయకుడు డా.కె.లక్ష్మణ్‌లు సైతం అసెంబ్లీకి పోటీ చేస్తారంటున్నారు. వారుకాక ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే భావిస్తున్న వారిలో మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.రామచంద్రరావు తదితరులున్నారు.

టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, శ్యామ్‌సుందర్‌గౌడ్‌, ఆకుల విజయ, మేకల సారంగపాణి, లంకల దీపక్‌రెడ్డి, ఆకుల రాజేందర్‌, వెంకటరెడ్డి, గౌతంరావు, రజనీరెడ్డి తదితరులున్నారు. టికెట్లు ఎప్పుడు ఇచ్చినా మిగతా పార్టీల కంటే ప్రచారంలో వెనకబడకుండా ఉండేందుకు ఇప్పటినుంచే ఇంటింటి ప్రచారాలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు తరచూ హాజరు కావాల్సి వస్తుండటంతో ఉన్న సమయంలోనే ఫంక్షన్లు, ఆయా కార్యక్రమాల పేరిట స్థానికులను కలుస్తూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డట్లు సమాచారం. ఓవైపు టికెట్లు ప్రకటించని పార్టీల ఆశావహులు తమకు దక్కుతాయో లేదోననే టెన్షన్‌లో ఉండగా, ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రం ఇప్పటి నుంచే వ్యయ ప్రయాసలకు మానసికంగా సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement