ఇన్‌కమ్‌ట్యాక్స్‌ టవర్స్‌ను పేల్చుతానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌కమ్‌ట్యాక్స్‌ టవర్స్‌ను పేల్చుతానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్టు

Jun 20 2023 1:26 AM | Updated on Jun 20 2023 1:28 PM

- - Sakshi

హైదరాబాద్: డయల్‌–100కు ఫోన్‌ చేసి ఈ నెల 12న నగరంలోని మూడు ప్రధాన ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలను ఏకకాలంలో బాంబులతో పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గుంటూరుకు చెందిన జైని రాధాకృష్ణ (43)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం మధ్య మండలం డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్‌ డీసీపీ ఎ.రమణారెడ్డిలు ఒక సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. జైని రాధాకృష్ణ వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడని, వాటినుంచి బయటపడేందుకు ఇలా తప్పుడు మార్గం ఎంచుకున్నాడని వారు పేర్కొన్నారు.

పథకం ప్రకారం జూన్‌ 11న రాత్రి గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు చేరుకున్న రాధాకృష్ణ..అక్కడి నుంచి నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని అక్కడ బాంబు బూచికి పథకాన్ని రచించాడు. అనుకున్నట్టుగా ఈ నెల 12న మూడు రహస్య ప్రదేశాల్లో బాంబును అమర్చినట్లు డయల్‌–100కు ఫోన్‌ చేశాడు.

పోలీసులు దాన్ని ఫేక్‌గా తేల్చి..అదే రోజు ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తి కోసం గాలించినా సరైన ఆధారాలు లేక అతడు చిక్కలేదు. దీంతో నిందితుడిపై నాంపల్లి పోలీసు స్టేషన్‌తో పాటుగా గాంధీనగర్‌, సైఫాబాదు పోలీసు స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చే శారు. ఈ నెల 18న హయత్‌నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎం.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement