● ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
హసన్పర్తి: ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిఽధిలోని నాలుగో డివిజన్ కృష్ణాకాలనీలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల తండాకు చెందిన గుగులోత్ రజిత (26), నర్సంపేట మండలం రాజీపేటకు చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నెల రోజుల క్రితం రజిత–అనిల్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కృష్ణాకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొంతకాలంగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్ తన భార్య రజిత కాళ్లు, చేతులు కట్టి కత్తితో మెడ కోసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో రజిత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లి హత్యకు గురికావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థినులు శనివారం తెల్ల వారు జామున చోటు అదృశ్యమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. అక్షయ, సాత్విక, అశ్విక అనే ముగ్గురు విద్యార్థినులు పాఠశాలలో చదవడం ఇష్టం లేక గోడ దూకి పారిపోయారు. దీనిని గమనించిన ఉపాధ్యాయురాలు శ్రావణి, అటెండర్ పర్విద పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాధవికి సమాచారం అందించగా ఆమె వెంటనే పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులతోపాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతుండగా ఉదయం పాఠశాల సమీపంలోని చెట్ల పొదల్లో దాచుకున్న విద్యార్థులు కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రవీణ్కుమార్ విద్యార్థులను విచారించగా తమకు ఈ గురుకులంలో చదవడం ఇష్టం లేదని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా ఒప్పుకోలేదని, గురుకులంలో చదువుకోవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. ఇంటి దగ్గర ఉండి చదువుకుంటామని పారిపోదామని అని అనుకున్నామని తెలిపారు. ఉదయం సమయానికి నిద్రలేవకపోవడంతో గుంజీలు తీయిస్తూ ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సూచించారు. పాఠశాల ప్రహరీకి పెన్సింగ్ మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


