
సమాచారం నమోదు చేయాలి
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
● రాంపూర్ డంపింగ్ యార్డు పరిశీలన
రామన్నపేట: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి రాంపూర్లోని డంపింగ్ యార్డ్డును ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యర్థాల నిర్వహణపై అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా డంప్ యార్డులో లెగసి వ్యర్థాల కోసం చేసిన పనుల నిర్ధారణ, బిల్లుల చెల్లింపుల గురించి తెలుసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం పనులు జరిగాయా? అని స్మార్ట్ సిటీ ప్రతినిధులను, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులకు తగు సూచనలిచ్చిన కమిషనర్ మిగతా పనుల్ని కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. డంప్ యార్డ్కు చెత్తను తరలించే వాహనాలకు చెత్తతో కూడిన వాహనాల బరువు (నెట్ వెయిట్) చెత్త వేసిన తర్వాత వచ్చే బరువు (లాస్ వెయిట్) వచ్చేలా ఏర్పాటు ఉండాలని, ఏ వాహనం ఎన్ని ట్రిప్పులు వేస్తుందో నమోదు చేసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా డంప్ యార్డ్ లేనందున శుభ్రపర్చిన 17 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు ఫ్రెష్ డంప్నకు వినియోగించుకోవాలని, మిగతా స్థలాన్ని ప్రాసెసింగ్ కోసం ఉపయోగించాలని స్మార్ట్ సిటీ ప్రతినిధులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, డీఈ రవికిరణ్, ఏఈలు రామన్న, సంతోశ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, తదితరులు పాల్గొన్నారు.