గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నోటికి వేలు అడ్డుపెట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ఈనెల 27 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని యూనియన్ నేతలు తెలిపారు. ప్రభుత్వం తమ నిరసనలపై స్పందించని పక్షంలో విధులను బహిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లించి వారి కుటుంబంలో వారికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలన్నారు. అనారోగ్యానికి గురైన కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు మంజూరు చేసి వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, రిక్వెస్టు ట్రాన్స్ఫర్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలని కోరారు.


