వైఎస్సార్ సీపీ నాయకులు వెళ్లే వరకు కేసు నమోదు చేయలేదు నిందితులను గుర్తించకపోతే భక్తులతో గ్రామ గ్రామన సంకీర్తనలు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మౌనదీక్ష చేపడతాం వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
నగరంపాలెం: ఆదిశక్తి అమ్మవారి ఆభరణాల చోరీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పెదకాకాని శ్రీగంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారి అభరణాల చోరీపై సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ(పరిపాలన) రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. అమ్మవారి నగల అపహరణపై కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
చోరీపై కుట్ర కోణమంటూ...
అనంతరం అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 22న స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అమ్మవారి నగల చోరీపై కుట్ర కోణం ఉందని విచారిస్తున్నామని చెప్పారని అన్నారు. రాజకీయాలు చేయడం సరికాదని, తప్పుడు సంప్రదాయాలతో ఎమ్మెల్యే వివరణ నేరమని చెప్పారు. దీనిపై పోలీస్స్టేషన్ సీఐ లేదా దేవదాయఽ ధర్మదాయ శాఖ డీసీ, జిల్లా ఎస్పీ వివరణ ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన తల్లి ఇంట్లో బంగారం ఆభరణాలు చోరీకి గురైతే 24 గంటల్లో కేసును పోలీసులు చేధించారని గుర్తు చేశారు. అయితే పెదకాకాని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారి నగలు దొంగలిస్తే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈనెల 14న అమ్మవారి నగలను భక్తులు గుర్తించగా, 19న వైఎస్సార్ సీపీ నాయకులు పెదకాకాని పీఎస్లో ఫిర్యాదు చేశారని అన్నారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఈ ఘటనపై దేవదాయ ధర్మదాయ శాఖ, ఆలయ అధికారులు, పూజారుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్తు చేశారు. ఈనెల 21న పెదకాకాని పోలీస్స్టేషన్కు వెళ్తే సీఐ, ఎస్ఐ లేరని, ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న ప్రయోజనం లేదని తెలిపారు. దేవాదాయ, ఆ శాఖ డీసీ వద్దకు వెళ్తే, డీసీ లేరని గుమస్తాకు ఫిర్యాదు చేసి వచ్చామని అన్నారు. 14వ తేదీన అమ్మవారి ఆభరణాలు అదృశ్యమైతే వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లే వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని గుర్తుచేశారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈనెల 21న జరిగిన శ్రావణ శుక్రవారం(వరలక్ష్మీ వ్రతం) రోజున అమ్మవారికి నగల్లేకుండా వరలక్ష్మీ వ్రతం ఎలా నిర్వర్తించారనేది భక్తులకు అంతుపట్టడంలేదన్నారు. దేవాలయ పూజారులను పోలీస్స్టేషన్కు పిలిచి అర్ధరాత్రులు వరకు పంచాయితీలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఎమ్మెల్యే అవినీతి కార్యక్రమాలు నియోజకవర్గం దాటి కాకాని గుడిలోకి ప్రవేశించాయని ధ్వజమెత్తారు. ప్రజా కోర్టులో ఎమ్మెల్యే నరేంద్ర జీరో అయ్యారని ఆరోపించారు. అమ్మవారి మంగళసూత్రం దొంగలించిన చోరులను గుర్తించకపోతే పొన్నూరులోని గ్రామాలు, వీధుల్లో నగర సంకీర్తనలు చేపడతామని చెప్పారు. అప్పటికి స్పందించకపోతే గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట భక్తులతో మౌనదీక్ష చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ గోళ్ల జ్యోతి, పార్టీ పెదకాకాని మండల అధ్యక్షుడు ముడియాల మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్ నాజర్, పెనుమాల అరుణ్కుమార్, భానుకిరణ్, తాడిబోయిన వేణుగోపాల్, డి.రవి, చింతలపూడి మురళీకృష్ణ, మహిళా మండలి అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నరేంద్ర వ్యాఖ్యలు సరికాదు


