సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు
లక్ష్మీపురం: దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్, కరోనా లాంటి కలావరానికి గురి చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. అర్హత మార్కులను 40 నుంచి 45 కు కుదించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారని, 150 మార్కులకి 60, 70, 90 మార్కులు సాధించాలంటే చిన్న విషయం కాదన్నారు. బోధించే పాఠ్యాంశంతో పాటు పలు సబ్జెక్టులతో కలిపి ఇచ్చే ప్రశ్నపత్రం ఈ వయసులో ఉపాధ్యాయులకు విషమ పరీక్ష లాంటిదన్నారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఈ పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉందని, మన రాష్ట్రంలో 80 వేల మంది ఈ పరీక్షలు రాసి అర్హత పొందితేనే ఉపాధ్యాయులుగా కొనసాగగలరని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని 40 లేక 45 మార్కులతో అర్హత మార్కులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పంజాబ్, మేఘాలయ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులని అధ్యయనం చేసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తగు వెసులుబాటు కల్పించి ఉపాధ్యాయుల సేవలను మెరుగైన పద్ధతుల్లో వినియోగించుకోవాలని ముప్పాళ్ల కోరారు.
ఇన్–సర్వీస్ ఉపాధ్యాయ టెట్ నోటిఫికేషన్లో మార్పు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్లో ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు కల్పించకుండా పూర్తిగా పాత పద్ధతిలోనే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొనటం విచారకరమని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు ఓప్రకటనలో తెలిపారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని, అందరికీ 40 శాతానికి మార్కులు అర్హతగా నిర్ణయించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను రాయటం సాధ్యం కాదని, వివిధ రకాల అర్హత పరీక్షలు నిర్ణయించడం సీనియర్ ఉపాధ్యాయులను మానసికంగా ఎంతో వేదనకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే టెట్ నోటిఫికేషన్లలో ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా మార్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వయసు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వారిలో మానసిక ఆందోళన దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేనిచో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.


