న్యూస్రీల్
‘ఎల్నినో’తో జిల్లాలో 41 శాతం లోటు వర్షపాతం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉపాధ్యాయుల బైఠాయింపు నాయకులను బలవంతంగా లాక్కెళ్లి తరలించిన పోలీసులు
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026
7
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1800, గరిష్ట ధర రూ.3700, మోడల్ ధర రూ.2500 వరకు పలికింది.
దుగ్గిరాల: కంఠంరాజుకొండూరులో కొలువైన శ్రీ మహంకాళి ఆలయ అభివృద్ధికి పెదకాకాని వాసి మెట్టు సాంబశివరెడ్డి – స్వప్న దంపతులు రూ.4.30 లక్షల విరాళం అందించారు.
అచ్చంపేట : ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.9103 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... దిగువకు అంతే నీరు వదులుతున్నారు.
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఖరీఫ్–2026 సీజన్కు కృష్ణా పశ్చిమ డెల్టాకు 15వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సీతానగరం వద్ద ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేస్తారని కలెక్టర్ వివరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు అవసరమయ్యే యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని విక్రయ కేంద్రాల్లో ఎరువుల పంపిణీ తప్పనిసరిగా ఏపీ–ఏఐఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో జూలై అవసరాలకు మించి యూరియా, డీఏపీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 209 రైతు సేవ కేంద్రాలు (ఆర్ఎస్కేలు), 43 ప్యాక్స్/డీసీఎంఎస్ కేంద్రాలు, 272 ప్రైవేట్ రిటైల్ దుకాణాల్లో ఎరువుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎల్నినో కారణంగా ఈ సీజన్లో 41 శాతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జల హారతి–జల ధార కార్యక్రమం కింద చేపట్టిన వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టి 0.69 టీఎంసీల అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించినట్లు తెలిపారు. రైతులకు వీలైనంత వరకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంతో పాటు ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించాయి. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నేతలు, ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాగేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ 2023 జూలై ఒకటో తేదీ నాటికి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి స్పందన లేవపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు విడతల్లో డీఏలు పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్య వైఖరి తగదు
ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. బసవ లింగరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. 13వ పీఆర్సీని డిమాండ్ చేయాల్సిన సమయంలో వ్యవధి దగ్గర పడుతున్న తరుణంలో 12వ పీఆర్సీకే దిగ్గు లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శించడం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మార్గదర్శకాలపై నిర్ణయ జాప్యం, పాఠశాలలు తెరిచి నెల కాకముందే పదవ తరగతికి మిషన్ 2027 పేరుతో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించడం చూస్తుంటే ఉపాధ్యాయుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి, సమస్యలను పరిష్కరించడాన్ని విస్మరిస్తున్నారన్నారు. పీఆర్సీలో నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతినెలా వేలాది రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. దేశంలో ఏ ఇతర శాఖల్లోని ఉద్యోగులకు లేని అర్హత పరీక్ష సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకే పెట్టడం ఏమిటన్నారు. దీనిపై పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని పేర్కొన్నారు. జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ కె. వీరాంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ. 25 వేల కోట్లకు పైబడి బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. వీటి చెల్లింపులలో నిర్దిష్టమైన కాల వ్యవధి లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో బకాయిల చెల్లింపులు జరగడం లేదన్నారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నా పాలకులు కనీసం స్పందించడం లేదని విమర్శించారు. గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ వై. శ్యాంబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలనడం తగదన్నారు. పార్లమెంటులో చట్ట సవరణ చేయడంతో పాటు ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా, బోధనకు ఆటంకం లేకుండా ఆన్లైన్ విధానంలో ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం సమర్పించారు. పికెటింగ్లో మాజీ ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు. రాజశేఖర్రావు, జి.దాసు, జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, షేక్ బాజీ, ఎండీ ఖాలీద్, మేకల సుబ్బారావు, ఎస్. రామచంద్రయ్య, గుడిపాటి దాస్, ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను లాక్కెళుతున్న పోలీసులు
జేసీ అశుతోష్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు


