వెనిగండ్లలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్తో నీటి వ్యాపారం కళాశాలలు, ఆసుపత్రులకు భారీగా ట్రాక్టర్లు, ట్యాంకర్లతో విక్రయం
పెదకాకాని: జల వనరులతో స్వప్రయోజనం కోసం చేస్తున్న అక్రమ నీటి వ్యాపారాన్ని మండల అధికారులు పరిశీలించారు. పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొంతకాలం క్రితం మైనర్ ఇరిగేషన్ ట్యాంక్కు సమీపంలో స్థలాన్ని ఆక్రమించాడు. మంచినీటి చెరువు, ఫిల్టర్బెడ్లు, సంపునకు సమీపంలో ఉన్న ఆ స్థలంలో బారు బావి తీయించాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ఆ బోరు ద్వారా నీటిని సుమారు 700 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా నిర్మించిన సంప్నకు పైప్లైన్ ద్వారా తరలిస్తున్నాడు. ఆ నీటితో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజూ కళాశాలలకు, ఆసుపత్రులకు ట్రాక్టర్లు, లారీల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తూ జేబులు నింపుకొంటున్నాడు. కొంతకాలం పంచాయితీ కనెక్షన్ ఉచితంగా వినియోగించుకున్నాడు. దీనిపై గ్రామానికి చెందిన వేల్పుల నాగరాజు ఇప్పటికే రెండు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో తన సొంత పొలంలో వేసిన బోరు బావి నీటిని ట్యాంకర్లకు అమ్ముకుంటున్న వ్యక్తికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెదకాకాని మండల అభివృద్ధి అధికారి రమావత్ శ్రీనివాసరావు, తహసీల్దార్ పి.కృష్ణకాంత్, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సారిక, పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి సాంబశివరావులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. వ్యవసాయ భూమి నుంచి పైపులైన్ ఏర్పాటు చేయడం, రోడ్డు పక్కనే సంపు, ట్యాంకర్లు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ కనెక్షన్లను గుర్తించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎంపీడీఓ తెలిపారు.


