
గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు
తెనాలి: విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 27వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస సదస్సును మేధావులు, సాహితీవేత్తలు, ప్రజాఉద్యమ నాయకులు జయప్రదం చేయాలని ‘అరసం’ జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇక్కడి ‘ఇస్కఫ్’ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో గ్రంథాలయాలు పూర్వవైభవం సంతరించుకునే ఉద్యమంలో ప్రతిఒకరూ పాలుపంచుకోవాలని సూచించారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమలి సింగారావు అధ్యక్షత వహించారు. ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకులు గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. దక్షిణాదిలోని రాష్ట్రాలు గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా జీర్ణావస్థలో ఉండటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నవి 1400 మాత్రమేనని, అవీ దీనావస్థలో ఉన్నాయన్నారు. ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చాక పాఠశాలల్లో గ్రంథాలయాలు అదృశ్యమైనట్టు చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించారు.
27న విజయవాడలో రాష్ట్రస్థాయి పునర్వికాస సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన ఉద్యమ నేతలు